తెలంగాణ

telangana

ETV Bharat / international

'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్​ హెచ్చరిక - AMERICA

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆ దేశ దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇటీవలే 300 బిలియన్​ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ట్రంప్​. తాజా పరిస్థితులతో అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మూడోస్థానానికి పడిపోయింది.

'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్​ హెచ్చరిక

By

Published : Aug 3, 2019, 11:13 AM IST

అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని చైనాను మరోమారు హెచ్చరించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. సెప్టెంబర్​లో జరగబోయే వాణిజ్య చర్చల్లో.. ఒప్పందం కుదరకపోతే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచుతామని పేర్కొన్నారు.

300 బిలియన్​ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తరువాతే ఈ మేరకు హెచ్చరించారు ట్రంప్​. పెంచిన సుంకాలు సెప్టెంబర్​ 1 నుంచి అమలులోకి రానున్నాయని వెల్లడించారు.

విలేకరులతే మాట్లాడుతున్న ట్రంప్​

"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగేందుకు చైనా చాలా చేయాల్సి ఉంది. సెప్టెంబర్​ 1 నుంచి చాలా జరగబోతున్నాయి. స్పష్టంగా చెబుతున్నా... ఒకవేళ వారు ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఎల్లప్పుడూ గణనీయంగా సుంకాలు పెంచుతూ పోతాను. నేను కావాలనుకుంటే పెద్ద మొత్తంలో పెంచుతాను."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మూడో స్థానానికి చైనా...

ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మొదటి అర్ధ సంవత్సరంలో చైనాను అగ్రరాజ్య పొరుగుదేశాలు మెక్సికో, కెనడా వెనుకకు నెట్టాయని వాల్​ స్ట్రీట్​ జర్నల్​ కథనం ప్రచురించింది. చైనా నుంచి అమెరికాకు దిగుమతుల్లో 12 శాతం, చైనాకు ఎగుమతుల్లో 19 శాతం మేర తగ్గిపోయినట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఉత్పత్తుల మార్పిడిలో సుమారు 14 శాతం పడిపోయినట్లు కామర్స్​ విభాగం నివేదికలో వెల్లడయింది.

ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధం: అమెరికాకు చైనా హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details