హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులకు అమెరికా మద్దతివ్వడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 1992 నాటి హాంకాంగ్ విధాన చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన 'హాంకాంగ్లో మానవహక్కులు, ప్రజాస్వామ్య చట్టం-2019' వీటిలో ప్రధానమైంది. హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న అక్కడి అధికారులపై ఆంక్షలు విధించేలా రూపొందించిన ఈ బిల్లుకు ఇటీవలే అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ట్రంప్ సంతకం చేశారు.
"చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆ దేశ పౌరులు, హాంకాంగ్ వాసుల పట్ల గౌరవంతో నేను ఈ బిల్లుపై సంతకం చేశాను. చైనా, హాంకాంగ్ ప్రజలు ఇరు వర్గాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోగలరని భావిస్తున్నాను. నూతన చట్టం ఆ ప్రాంతంలో దీర్ఘకాలికంగా శాంతి, అభివృద్ధికి దోహదం చేస్తుంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
హాంకాంగ్ బిల్లుపై తొలుత సంతకం చేయనని చెప్పారు ట్రంప్. మనసు మార్చుకుని ఆమోదముద్ర వేయడంపై చట్టసభసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
'అగ్రరాజ్య నిర్ణయం సరికాదు'
ప్రజాస్వామ్య నిరసనకారులకు మద్దతు ఇస్తూ అమెరికా చట్టం చేయడం సరికాదని పేర్కొంది హాంకాంగ్ ప్రభుత్వం.