తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2021, 12:00 PM IST

ETV Bharat / international

చెక్కుచెదరని ఆధిపత్యం- దటీజ్​ 'ట్రంపిజం'!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు ప్రయోగించిన అభిశంసన అస్త్రం సెనేట్​లో వీగిపోయింది. ట్రంప్​కు వ్యతిరేకంగా కేవలం ఏడుగురు రిపబ్లికన్లు ఓట్లు వేయగా.. మిగిలిన వారు ఆయన్ను గట్టెక్కించారు. దీనితో పార్టీపై ట్రంప్​ ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు.. ఆయన తిరుగు లేని శక్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది.

Trump remains dominant force in GOP following acquittal
అభిశంసనలోనూ గెలిచిన 'ట్రంపిజం'

"రిపబ్లికన్​ పార్టీలో చీలిక... మాజీ అధ్యక్షుడు ట్రంప్​పై సొంత పార్టీలోనే వ్యతిరేకత... జీఓపీపై పట్టుకోల్పోతున్న ట్రంప్!"... ఇవీ కొంతకాలంగా అమెరికావ్యాప్తంగా వినిపించిన మాటలు. క్యాపిటల్​ హింసాకాండ నేపథ్యంలో ఆయనపై రిపబ్లికన్​ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఇందుకు ఓ కారణం. అందుకు తగ్గట్టుగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు ప్రయోగించిన అభిశంసన అస్త్రం.. ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ఇక జీఓపీ(రిపబ్లికన్ పార్టీ)లో ట్రంప్​ శకం ముగిసినట్టే అని చాలా మంది అనుకున్నారు. కానీ శనివారంతో ఆ ఊహాగానాలు, అంచనాలకు చెక్​​ పడింది. అభిశంసనలో ట్రంప్​ గట్టెక్కారు. రిపబ్లికన్లు ఆయన్ను గట్టెక్కించారు!

ఆధిపత్యం...

మాజీ అధ్యక్షుడు ట్రంప్​.. తన ప్రసంగాలతో మద్దతుదారులను ప్రేరేపించారని.. అందుకే జనవరి 6న క్యాపిటల్​పై దాడి జరిగిందన్నది డెమొక్రాట్ల వాదన. డెమొక్రాట్ల ఆధిపత్యంతో ప్రతినిధుల సభలో అభిశంసన గట్టెక్కింది.

అయితే సెనేట్​లో.. అభిశంసనపై శనివారం జరిగిన విచారణలో ఏడుగురు రిపబ్లికన్ల మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆ ఓట్లు సరిపోక.. అభిశంసన వీగిపోయింది. దీనిని గమనిస్తే.. అధ్యక్ష పదవిని వీడినప్పటికీ.. పార్టీపై ట్రంప్​ ఆధిపత్యం తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదీ చూడండి:-ఓడింది ట్రంప్​ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!

ట్రంప్​ వ్యవహారంలో పార్టీ రెండుగా చీలిపోయిందన్న విషయం నిజమే. కానీ ట్రంప్​కు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి మాత్రం చట్టసభ్యులు ముందుకు రాకపోవడం గమనార్హం.

అదే సమయంలో ట్రంప్​ మద్దతుదారులు ఈ అభిశంసనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ట్రంప్​ను ఎట్టిపరిస్థితుల్లోనైనా గట్టెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఆయనతో తిరిగి అనుబంధం పెంచుకోవాలన్నది వారి ఉద్దేశం.

ట్రంప్​ను వ్యతిరేకించే వారు మాత్రంపై పార్టీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రజలకు పార్టీ దూరమైపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:-గెలుపైనా.. ఓటమైనా... నిను వీడని నీడ మేమే!

భయంతో...?

ట్రంప్​ను ఎదిరిస్తే.. తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు రిపబ్లికన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో.. క్యాపిటల్​ హింసాకాండ అనంతరం ట్రంప్​పై విరుచుకుపడ్డారు ప్రతినిధుల సభ మైనారిటీ నేత కెవిన్​ మెక్​కార్తీ. హింసకు ట్రంప్​దే బాధ్యత అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే.. ఆయన మాట మార్చేశారు. విభేదాలు తొలగించేందుకు.. ఫ్లొరిడాలోని ట్రంప్​ ఎస్టేట్​కు వ్యక్తిగతంగా వెళ్లి మరీ భేటీ అయ్యారు.

తాజాగా.. సెనేట్​లో ట్రంప్​నకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడుగురిలో ఒక్కరికి మాత్రమే రానున్న నాలుగేళ్లలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండటం గమనార్హం.

ఏది ఏమైనా.. ఈ అభిశంసన ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. పార్టీలో ట్రంప్​కు అసాధారణ శక్తి, మద్దతు ఉందని రుజువైంది. వాషింగ్టన్​కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. పార్టీలో ట్రంపిజం మాత్రం చెక్కుచెదరకుండా అలగే ఉందని అర్థమైంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం ట్రంప్​కు అవకాశాలు ఇంకా తెరుచుకునే ఉన్నాయని తేలింది.

ఇదీ చూడండి:-ట్రంప్​ కథ ముగిసినట్లేనా- మళ్లీ పీఠమెక్కుతారా?

ABOUT THE AUTHOR

...view details