అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ అధ్యక్ష ఎన్నికలు భద్రంగా, నిజాయతీగా జరిగాయని వెల్లడించిన ఓ ఎన్నికల ఉన్నతాధికారిపై వేటు పడింది. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన సైబర్సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెబ్స్ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియపై అసత్య వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను తొలగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ట్రంప్కు పడాల్సిన ఓట్లన్నీ జో బైడెన్కు వెళ్లాయి..
‘2020 ఎన్నికల భద్రతపై క్రిస్ (క్రిస్టోఫర్) క్రెబ్స్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. అధ్యక్ష ఎన్నికల్లో చాలా అవకతవకలు, మోసాలు జరిగాయి. చనిపోయినవారి ఓట్లు పడ్డాయి. ఓటింగ్ మెషిన్లలో సమస్యలు తలెత్తాయి. దాని వల్ల ట్రంప్కు పడాల్సిన ఓట్లన్నీ జో బైడెన్కు వెళ్లాయి. చాలా చోట్ల ఓటింగ్ రోజుల తరబడి జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అందుకే తక్షణమే క్రిస్ క్రెబ్స్ను సీఐఎస్ఏ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తున్నా’ అని ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోలేదనేది ఒకటే భద్రమైన విషయమని, అది కూడా ట్రంప్ పాలనాయంత్రాంగం వల్లే సాధ్యమైందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.