తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ ​X బైడెన్​: తొలి డిబేట్​లో పైచేయి ఎవరిది?

మరికొన్ని గంటల్లో అమెరికన్​ అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలో.. రసవత్తర ఘట్టానికి తెరలేవనుంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఆయనకు సవాల్​ విసురుతున్న జో బైడెన్ ఎదురుపడి మాటల యుద్ధంలో తలపడనున్నారు. ఎన్నికల క్రతువులో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంవాదాల్లో భాగంగా... మొదటి డిబేట్​ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు(భారత కాలమానం ప్రకారం) జరగనుంది.

By

Published : Sep 29, 2020, 7:48 PM IST

Trump, Biden prepare to debate
ట్రంప్​Xబైడెన్​: తొలి డిబేట్​కు సిద్ధమేనా ?

కరోనా కల్లోలాన్ని లెక్క చేయకుండా.. అధ్యక్ష ఎన్నికల్లో అమీ-తుమీ తెల్చుకునేందుకు సై అంటున్నారు ట్రంప్​-బైడెన్​. ప్రపంచదేశాలను ప్రభావితం చేసే అగ్రరాజ్యం తర్వాత అధ్యక్షుడు ఎవరో తేల్చే.. పోరులో భాగంగా తొలి డిబేట్​ జరగనుంది. అమెరికన్​ కాలమానం ప్రకారం సెప్టెంబర్​ 29 రాత్రి 9 గంటలకు ఆరంభమయ్యే ఈ సంవాదం.. భారత కాలమానంలో సెప్టెంబర్​ 30-బుధవారం ఉదయం 6:30గంటలుగా ఉంది.

రసవత్తర పోరు

ఇప్పటికే ప్రచార పర్వంలో హోరాహోరీగా దూసుకెళ్తున్నారు అధ్యక్షుడు, రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​- డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్. ఈ ప్రహసనంలో అత్యంత కీలకమైన డిబేట్​ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఒక్క సంవాదంతో భారీగా ప్రజల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండటం వల్ల తమ బృందాలతో కలిసి డిబేట్​ అంశాలపై కుస్తీ పడుతున్నారు.

ఇప్పటికీ ఎవరిది పైచేయి అని తేల్చలేకపోతున్న విశ్లేషకులు... ఈ రసవత్తర పోరులో మొదటి డిబేట్​ కీలకం కానుందంటున్నారు. అయితే, ఈ సంవాదం ఎక్కువగా ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నేపథ్యంలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు, కరోనా కాష్ఠంలో పోయిన ప్రాణాలు, మహమ్మారి తీసుకొచ్చిన సంక్షోభం వంటి అంశాలతో అధ్యక్షుడిని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు ప్రత్యర్థి బైడెన్​.

మొదటి డిబేట్​కు సర్వం సిద్ధం

బైడెన్​ బలమెంత ?

ప్రస్తుతానికి జాతీయ సర్వేల్లో ఆధిక్యంలో ఉన్న బైడెన్​.. క్లీవ్​ల్యాండ్, ఒహాయోలో జరగనున్న డిబేట్​లోకి మరింత ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతానికి విశ్లేషకులు మాటల దాడిలో భాగంగా ట్రంప్.. బైడెన్​ను ఇరకాటం పెట్టేస్థాయిలో ఆరోపణలు చేయలేకపోతున్నారంటున్నారు. ముఖ్యంగా తన విజయాలు అదీ... కరోనా కట్టడి గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారని.. కానీ, పరిశీలిస్తే అమెరికాలోనే వైరస్​ వల్ల అత్యధిక మంది చనిపోయారని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బైడెన్​ గనుక ట్రంప్​ను ఇరకాటంలో పెట్టలేకపోతే... ఆయన వైఫల్యమే అవుతుందని వాదిస్తున్నారు. మొదటి డిబేట్​లో ప్రధాన అంశాలుగా ఉన్న సుప్రీం కోర్టు, కొవిడ్​-19, ఆర్థిక వ్యవస్థ, జాత్యాంహకారం-నగరాల్లో హింస, ఎన్నికల పారదర్శకత వంటి విషయాలపై ఇరువురు నేతలు ఇప్పటికే కసరత్తులు చేశారు. వీటిలో సుప్రీం కోర్టు వివాదాలు, కరోనాపై ట్రంప్​ సర్కారు పోరు వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరగనుంది. అలాగే, తాజాగా ట్రంప్​ ఆదాయ పన్ను వివాదం రేగిన నేపథ్యంలో బైడెన్​ ఈ అంశంపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంప్రదాయ ఫార్మల్​ డిబేట్లలో గొప్ప ట్రాక్​ రికార్డు లేని ట్రంప్... బైడెన్​ సంధించే ప్రశ్నలకు ఎలా జవాబిస్తారన్నది ఆసక్తికరంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ట్రంప్​పైన పైచేయి సాధించినట్లు కనిపిస్తున్న బైడెన్​.. సంవాదంలో ట్రంప్​ను ఇరకాటంలోకి నెడితే రిపబ్లికన్​ అభ్యర్థికి కష్టమేనని విశ్లేషిస్తున్నారు.

ట్రంప్​ తెగువెంత ?

ముఖ్యంగా నగరాల్లోని ప్రజలు ఈ డిబేట్లతో ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున.. ట్రంప్​ సైతం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. గతంలో మద్దతు తక్కువగా ఉన్న వృద్ధులు, మహిళలను ఈసారి తనవైపు తిప్పుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే డిబేట్​ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నాలుగేళ్ల క్రితం.. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్లలో నాటి డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్​- ట్రంప్​ను ఓడించేలానే కనిపించారు. కానీ, ఫలితాలు భిన్నంగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు మరికొంత మంది విశ్లేషకులు. ​

ఇప్పటికే ట్రంప్.. బైడెన్​పై మాటల దాడి పెంచారు. సెనెటర్​గా ఉన్నపుడు అవినీతికి పాల్పడిన ఆధారాలున్నాయని పదేపదే చెబుతున్నారు. ప్రచారంలో పనితీరు పెంచుకునేందుకు డ్రగ్స్​ తీసుకుంటున్నారని, పరీక్షించాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

అధ్యక్షుడు ట్రంప్​ ప్రత్యర్థుల బలహీనతలపై విరుచుకుపడే స్వభావం కలగి ఉంటారని.. అవకాశం దొరికితే మాటల దాడితో ముప్పుతిప్పలు పెడతారని రిపబ్లికన్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్యా మొదటి డిబేట్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవాదంలో పైచేయి సాధించటమే లక్ష్యంగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ట్రంప్​-బైడెన్.

మొదటి డిబేట్​ కరోనా ఆంక్షల మధ్యే సాగనుంది. అభ్యర్థుల నిలబడే వేదిక గతంలో కంటే దూరంగా ఉండనుంది. కరచాలనానికి కత్తెర వేసిన నేపథ్యంలో.. డిబేట్​లోనే ఇరువురు నేతల పలకరింపులు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ట్రంప్​ X బైడెన్​: మొదటి డిబేట్​కు సై!

ఇదీ చూడండి:అమెరికాలో ఆగని కార్చిచ్చు - ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details