అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించడాన్ని ఇకపై సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చాలా కాలంగా తమ దేశ ఉత్పత్తులపై భారత్ సుంకాలు పెంచుతూనే ఉందని ట్వీట్ చేశారు.
జపాన్లో జీ-20 సదస్సు వేదికగా ట్రంప్- మోదీ కలిసిన కొద్ది రోజులకే అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ వ్యాఖ్యాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు ఇరు దేశాల ఆర్థిక మంత్రులతో సమావేశం కావాలని జీ-20 సదస్సులో ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సుంకాల పెంపు విషయంపై మోదీతో చర్చిస్తానని భేటీకి ముందే ట్వీట్ చేశారు ట్రంప్.
భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా సంస్థలకు భారత మార్కెట్లో అవకాశాలు, ఆ దేశ వస్తువులపై ఇటీవలి కాలంలో సుంకాల పెంపు వంటి అంశాలు వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.