శ్వేతసౌధంలో కరోనా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డెస్కుల మధ్య దూరం పాటించడం సహా టెస్టింగ్ రిస్ట్ బ్యాండ్లు, మాస్కులను తప్పనిసరిగా ధరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త అధ్యక్షుడి రాకతో వైట్హౌస్లో ఈ నిబంధనలన్నీ అమలవుతున్నాయి.
ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రతిరోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఎన్95 మాస్కులను తప్పక ధరించాలని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఇదివరకే స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించుకున్నట్టు సూచించే చేతి బ్యాండ్లను జో బైడెన్కు సమీపంలో పనిచేసే అధికారులకు ఇస్తున్నారు. అధ్యక్షుడి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతున్నారు. బైడెన్ ప్రసంగించేటప్పుడు ఎవరు ఎక్కడ నిల్చోవాలో సూచించేలా కార్పెట్పై గుర్తులు వేస్తున్నారు. సిబ్బంది వాడే ల్యాప్టాప్ వాల్పేపర్పై కరోనా లక్షణాలు, అవి కనిపిస్తే సంప్రదించాల్సిన శ్వేతసౌధ వైద్యుల నెంబర్లను ఏర్పాటు చేశారు. గురువారం కొవిడ్ బృందంతో బైడెన్ సమావేశమైన సమయంలోనూ.. అధికారులను కనీసం ఆరు అడుగుల దూరంలో కూర్చోబెట్టారు. శ్వేతసౌధ కొవిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్ జెఫ్రీ వెక్స్లర్ కరోనా నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నారు.