అమెరికాలో కొద్ది రోజులుగా కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చాలా రాష్ట్రాలు, స్థానిక అధికారులు కఠిన నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రిపబ్లికన్ గవర్నర్లు మాస్క్లు తప్పనిసరి చేశారు. పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు.
థ్యాంక్స్గివింగ్ సెలవు..
మాస్క్లు ధరించటం, భౌతిక దూరం పాటించటం వెనక ఉన్న శాస్త్రీయ మూలాన్ని ప్రశ్నించే వారికి ఈ చర్యలు నచ్చకపోవచ్చు. కొత్త ఆంక్షలతో భారీగా ఉద్యోగాలు కోల్పోవటం, పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారి భయపడుతుండటమే అందుకు కారణం. వచ్చే వారం థ్యాంక్స్గివింగ్ హాలిడే వస్తున్న క్రమంలో భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య అధికారులు పేర్కొంటున్నారు. చాలా తక్కువ మందితో థ్యాంక్స్గివింగ్ను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
భారీ పెరుగుదల..
కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలించటం లేదు. కొద్ది రోజులుగా వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, మరణాలు, కేసుల సంఖ్య ఆకాశాన్నంటుతోంది. సోమవారం ఒక్కరోజే 73 వేల మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం సోమవారం 1,66,000పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే రోజువారీ సగటు కేసుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. రెండు వారాల క్రితం రోజు వారి సగటు మరణాలు 828గా ఉండగా.. అది 1,145కు చేరింది.