తెలంగాణ

telangana

6 వారాల పసికందునూ మింగేసిన 'కరోనా'

By

Published : Apr 2, 2020, 10:36 AM IST

Updated : Apr 2, 2020, 11:32 AM IST

అమెరికా కనెక్టికట్​ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్​ కారణంగా.. ఆరు వారాల పసికందు మృత్యువాత పడింది. ఈ ఘటనతో యావత్​ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Six-week-old baby dies of coronavirus in US
ఆరువారాల పసికందును మింగేసిన 'కరోనా'

ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్​.. అమెరికాలో ఓ ఆరు వారాల పసికందును మింగేసింది. కనెక్టికట్​లో ఈ విషాద ఘటన జరిగినట్లు ఆ రాష్ట్ర గవర్నర్​ నెడ్​ లామోంట్​ స్పష్టం చేశారు. 32 రోజుల వయసున్న చిన్నారినీ కరోనా వదల్లేదని.. ఈ మహమ్మారికి ఎవరూ అతీతులు కాదనేందుకు ఇదే నిదర్శనమని హెచ్చరించారు లామోంట్​.

" కనెక్టికట్​లో కరోనాతో మృతి చెందిన అతి పిన్న వయస్కురాలు బహుశా ఈ పాపే కావొచ్చు. చిన్నారికి కనీసం ఏడు వారాల వయసు కూడా లేదు. ఈ మహమ్మారితో ఎవరి ప్రాణాలూ భద్రం కాదని ఈ పసికందు మరణం గుర్తుచేస్తోంది."

- నెడ్​ లామోంట్, కనెక్టికట్​ గవర్నర్​​

హార్ట్​ఫోర్డ్​కు చెందిన ఈ చిన్నారి ఉలుకుపలుకూ లేకుండా ఉన్నందున గతవారమే ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అయితే పసికందుకు కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు పోస్టుమార్టంలో తేలిందని గవర్నర్ ట్వీట్​ చేశారు. ఈ వైరస్​కు జాలి, దయ లాంటివి లేవని, ఇంట్లో ఉండాల్సిన ప్రాధాన్యాన్ని ఈ ఘటన గుర్తుచేస్తున్నట్లు తెలిపారు లామోంట్.

'సమగ్ర యుద్ధం కొనసాగుతుంది'

భయంకరమైన కరోనా వైరస్​పై విజయం సాధించేందుకు సమగ్ర యుద్ధాన్ని కొనసాగిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో 5,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.15 లక్షల మందికిపైగా అమెరికన్లు వైరస్​ బారిన పడ్డారు.

Last Updated : Apr 2, 2020, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details