అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన న్యూయార్క్ క్రమంగా కోలుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. న్యూయార్క్ మినహా అమెరికా అంతటా ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జన సంచారంపై నిషేధాజ్ఞలను సడలిస్తుండటంతో కరోనా వ్యాప్తి పెరుగుతోంది.
న్యూయార్క్ మెట్రోపాలిటిన్ ప్రాంతం శివారులోని లాంగ్ ఐలాండ్, ఉత్తరాది న్యూజెర్సీ ప్రాంతాలు కరోనాకు తీవ్రస్థాయిలో అతలాకుతలం అయ్యాయి. దేశవ్యాప్తంగా సంభవించిన 70 వేలకుపైగా మరణాల్లో మూడో వంతు ఇక్కడే సంభవించాయి. మరోవైపు, అమెరికాలో కేసుల సంఖ్య మొత్తంగా చూస్తే తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో ప్రతి లక్ష మందిలో కరోనా బారిన పడుతున్నవారి సగటు గత నెల 13న 9.3గా ఉండగా, సోమవారం నాటికి ఆ సంఖ్య 8.6కు తగ్గింది. అదే సమయంలో ఈ గణాంకాల నుంచి న్యూయార్క్ ప్రాంతాన్ని మినహాయించి చూస్తే.. మూడు వారాల క్రితం ప్రతి లక్ష మందిలో 6.2 మందికి కరోనా సోకగా సోమవారం నాటికి ఆ సంఖ్య 7.2కు పెరిగింది. కరోనా దెబ్బకు అమెరికాలో గత నెల్లో 2.02 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
న్యూయార్క్లోని అమెజాన్ కంపెనీ గిడ్డంగిలో పనిచేసే ఓ ఉద్యోగి కొవిడ్-19 బారిన పడి మరణించారు.
అఫ్గాన్లో 3.5 కోట్ల మందికి సోకే ముప్పు
సత్వర మెరుగైన నివారణ చర్యలు చేపట్టకపోతే అఫ్గానిస్థాన్లో దాదాపు 3.5 కోట్ల మందికి కరోనా సోకే ముప్పుందని అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ దేశంలో 3 వేలకుపైగా కేసులున్నాయి. కాబూల్లో ఇటీవల ర్యాండమ్గా 500 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 50% మందికిపైగా వైరస్ సోకినట్లు వైల్లడైంది.