మానవ రోగ నిరోధక వ్యవస్థను కరోనా వైరస్ బోల్తా కొట్టిస్తున్న తీరును అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వైరస్ జన్యుక్రమం.. మన శరీరంలో అంతర్భాగమేనని భ్రమింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ఎంజైమ్ను వారు గుర్తించారు. దాని నిర్మాణాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. ఈ బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా నేతృత్వం వహించారు. కొవిడ్-19 చికిత్స కోసం కొత్త రకం యాంటీవైరల్ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది.
రోగ నిరోధక ప్రతిస్పందన
ఎన్ఎస్పీ-10 అనే ప్రొటీన్.. వైరల్ ఎంఆర్ఎన్ఏల (ప్రొటీన్ల ఉత్పత్తి కేంద్రాలకు జన్యుకోడ్లను పంపే వ్యవస్థ)లకు మార్పు చేసి, అవి మానవ ఎంఆర్ఎన్ఏలా కనిపించేలా చూస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మార్పు ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్ను రక్షిస్తుందని చెప్పారు.