ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. అందులో ఒకటైన మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(ఎంఐఎస్) పిల్లల గుండెపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. దీంతో కొవిడ్ సోకిన పిల్లల గుండె పనితీరును వారి జీవిత కాలం పర్యవేక్షించాల్సిన అవసరం ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు లాన్సెట్కు చెందిన ఈక్లినికల్మెడిసిన్ అనే జర్నల్లో అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 నుంచి జులై 25 మధ్య ఎంఐఎస్తో ఆస్పత్రుల్లో చేరిన 662 మంది పిల్లలపై అధ్యయనం జరిపారు. అందుకు సంబంధించిన ఫలితాలను ప్రచురణలో పొందుపరిచారు.
లక్షణాలు లేకపోయినా..
పిల్లల్లో కరోనా వైరస్ తొలి రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని అధ్యయనంలో గుర్తించారు. వైరస్ సోకినా తొలి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు మహమ్మారి బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను జాగ్రత్తగా పరీక్షిస్తే.. కొవిడ్కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న తీవ్ర సమస్యగా నిర్ధారణ అవుతోంది.
అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన ఇతర అంశాలు...
- ఎంఐఎస్తో ఆస్పత్రిలో చేరిన వారిలో 71 శాతం మంది ఐసీయూలో చేరారు.
- 60 శాతం మంది షాక్కు గురయ్యారు.
- ఒక్కొక్కరు సగటున 7.9 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోంది.
- 100 శాతం మంది జ్వరం, 73.7 శాతం మంది డయేరియా లేదా కడుపునొప్పి, 68.3 శాతం మంది వాంతులతో బాధపడ్డారు.
- 90 శాతం మందికి ఎకోకార్డియోగ్రామ్(ఈసీజీ) పరీక్ష చేయాల్సి వచ్చింది. 54 శాతం మందిలో అసాధారణ ఫలితాలు వచ్చాయి.
- 22.2 శాతం మందికి కృత్రిమ శ్వాస అందించాల్సి వచ్చింది.
- 4.4 శాతం మందికి ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)అవసరమైంది.
- 11 శాతం మంది చనిపోయారు.