కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దావానలం ధాటికి ఈ ఏడాది సుమారు 40 లక్షల ఎకరాలు దగ్ధమైంది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల ఇళ్లు కాలిపోయాయి.
కనెక్టికట్ రాష్ట్రం విస్తీర్ణం కన్నా ఎక్కువ ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నాయి. సాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన్న ఉన్న వైన్ కంట్రీలో శుక్రవారం హైఅలర్ట్ ప్రకటించింది అగ్నిమాపక శాఖ. శనివారం భీకర గాలులతో భయంకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
నాపా, సోనోమా ప్రాంతాల్లో శనివారం 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. దాంతో అగ్ని జ్వాలలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని, 28 వేల ఇళ్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించారు.
" అంచనా వేసిన ప్రకారం భీకర గాలులేమి ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ, తప్పకుండా గాలులు వీస్తాయి. దాంతో దావానలం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అదే ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం అగ్ని జ్వాలలు ఉన్న పశ్చిమ భాగంలో అధిక ఎత్తులో గాలులు వీస్తున్నాయి. మంటలను నిరోధించటానికి పెద్దఎత్తున ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాలిస్టోగా నగరంలో భారీగా సిబ్బంది, సామగ్రిని మోహరించాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, నల్లటి పొగ ఆవరించి ఉంది.
- మార్క్ బ్రుటన్, అగ్నిమాపక విభాగం చీఫ్, కాలిఫోర్నియా