పారిస్ ఒప్పందంలోని దేశాల కంటే అమెరికాలోనే కర్బన ఉద్గారాలు తగ్గాయని డిబేట్లో పెన్స్ అన్నారు. ఆవిష్కరణలు, సహజవాయులతోనే ఇది సాధ్యమైందన్నారు. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పారిస్ ఒప్పందంలో తిరిగి చేరి అమెరికాకే తీవ్ర నష్టం కలిగేలా చేస్తారని ఆరోపించారు.
'ట్రంప్ హయాంలో నల్ల జాతీయులకు అన్యాయం' - mike pence debate with kamal harris

08:14 October 08
08:00 October 08
జార్జి ఫ్లాయిడ్ ఘటన తర్వాత హింసాత్మక ఘటనలు, దుకాణాల్లో లూటీలు జరిగాయని.. అలాంటి చర్యలను ట్రంప్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను సహించదని పెన్స్ స్పష్టం చేశారు.
07:51 October 08
ట్రంప్ హయాంలో నల్ల జాతీయులకు అన్యాయం జరిగిందని కమల ఆరోపించారు. అమెరికా కోర్టులలో 50 మంది అసమర్థ వ్యక్తులను శాశ్వతంగా నియమించారని విమర్శించారు. 50మందిలో ఒక్క నల్ల జాతీయుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. బ్రయోనా టేలర్ కేసులో ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. జార్జి ఫ్లాయిడ్ ఘటన తర్వాత అనేక మంది ర్యాలీలు నిర్వహించారని గుర్తు చేశారు.
07:46 October 08
ఇరాక్లో జరిగిన దాడిలో అమెరికా బలగాలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు హారిస్. కొంత మంది సైనికులకు మెదడు గాయాలు అయితే ట్రంప్ వాటిని తలనొప్పి అని తోసుపుచ్చారని మిమర్శలు గుప్పించారు.
07:40 October 08
అమెరికా మిత్రదేశాలకు ట్రంప్ వెన్నుపోటు పొడిచారని తీవ్ర విమర్శలు చేశారు కమలా హారిస్. అగ్రరాజ్యం అధ్యక్షుడి కంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్కే మిత్ర దేశాలు ఎక్కువగా గౌరవం ఇస్తున్నాయని ధ్వజమెత్తారు.
07:35 October 08
ఉగ్రవాదం అంశంలో ట్రంప్ ప్రభుత్వం పనితీరు గొప్పగా ఉందన్నారు పెన్స్. ఐసిస్ సంస్థ ముఖ్యనేతను అంతమొందించామని గుర్తు చేశారు. ఇరాన్కు చెందిన ఖాసీం సులేమానీని తమ ప్రభుత్వమే మట్టుబెట్టిందన్నారు.
07:27 October 08
కరోనా వైరస్కు చైనానే కారణమని మైక్ పెన్స్ అన్నారు. ఆ దేశంపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని బెైడెన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
07:26 October 08
చైనా విషయంలో ట్రంప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా ఉద్యోగాలు పోవడమే కాక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని కమలా హారిస్ ఆరోపించారు.
07:22 October 08
జో బైడెన్ చైనాకు దశాబ్దాలుగా చీర్ లీడర్గా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.
07:21 October 08
చైనాతో వాణిజ్య యుద్ధంలో ట్రంప్ ప్రభుత్వం ఓటమి పాలైందని విమర్శించారు కమలా హారిస్.
07:15 October 08
ఒబామా హెల్త్ కేర్ దారుణంగా విఫలమైందని, అందుకే రద్దు చేశామని పెన్స్ అన్నారు.
07:12 October 08
2కోట్ల మంది అమెరికన్లకు ప్రయోజనం చేకూర్చే ఒబామా హెల్త్ కేర్ను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు హారిస్. ప్రజల ఆరోగ్య సంరక్షణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
07:07 October 08
హారిస్ మాట్లాడుతుండగా పెన్స్ మధ్యలో జోక్యం చేసుకున్నారు. తాను మాట్లాడుతుండగా దయచేసి అడ్డుపడొద్దని హారిస్ బదులిచ్చారు.
07:02 October 08
హారిస్ వ్యాఖ్యలకు పెన్స్ బదులిచ్చారు. వ్యాపారవేత్త అయిన ట్రంప్.. ఆదాయ పన్నుగా మిలియన్ డాలర్లు చెల్లించారని చెప్పారు.
07:00 October 08
అధ్యక్షుడు ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించడంపై కమల విమర్శలు గుప్పించారు. పన్ను విషయాన్ని దాచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అధ్యక్షుడు చెలిస్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
06:53 October 08
ఏడాదిలోపే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని పెన్స్ చెప్పారు. ప్రస్తుతం 5 వ్యాక్సిన్ క్యాండిడేట్లు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
06:46 October 08
కరోనా వైరస్పై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్కు జనవరిలోనే సమాచారం అందిందని డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేకపోయిందని విమర్శించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు.
06:41 October 08
కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. వైరస్ వ్యాప్తికి చైనానే కారణమన్నారు. ట్రంప్ చర్యల వల్ల వేలాది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. చైనా ప్రయాణాలపై నిషేధం విధించి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.
04:10 October 08
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ప్రత్యక్ష సంవాదం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లిన్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్ బుధవారం ముఖాముఖీ తలపడుతున్నారు. యూటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో ఈ కార్యక్రమం జరగుతోంది. యూఎస్ఏ టుడే పత్రికకు చెందిన సుసన్ పేజ్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. అమెరికా చరిత్రలో ఓ ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఓ భారత సంతతి వ్యక్తి పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా సంక్షోభం ముదురుతుండటం, అధ్యక్షుడు ట్రంప్ వైరస్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు వీరిపైనే ఉంది.
హారిస్ ఆధిపత్యంపై అంచనాలు..
వీరి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు దోహదం చేయనుంది. మరోవైపు ట్రంప్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత విధానాలతో పాటు ట్రంప్ లక్ష్యాలను కూడా పెన్స్ వివరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:-ట్రంప్ X బైడెన్: వాడీవేడిగా తొలి డిబేట్
బైడెన్ బృందంలో హారిసే కీలక పాత్ర పోషించనున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురి చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. చర్చలో పెన్స్పై హారిస్ ఆధిపత్యం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కరోనా జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం..
అధ్యక్ష అభ్యర్థుల ప్రత్యక్ష చర్చలో పాల్గొన్న కొన్ని రోజులకే ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా కార్యక్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల మధ్య గ్లాస్ ఏర్పాటు చేశారు.
కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్
డిబేట్కు కొన్ని గంటల ముందు నిర్వహించిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో కమల, పెన్స్లకు నెగిటివ్గా తేలింది.