మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు. టీకా తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు గేట్స్. తనకు 65ఏళ్ళు ఉండటం వల్లే.. వ్యాక్సిన్కు అర్హత పొందినట్టు ట్వీట్ చేశారు.
"నా వయసు రీత్యా ఈ ప్రయోజనం పొందాను. తొలి డోసు వేయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలు, ప్రయోగాల్లో పాల్గొన్న వలంటీర్లు, నిర్వహకులు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు."
- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు
తాము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో సమర్థవంతమైన టీకాలు వచ్చాయని గేట్స్ తెలిపారు. అయితే.. ఇవన్నీ త్వరలోనే మార్కెట్లోకి విడుదలైతేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని చెప్పారు. మరోవైపు.. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
మరో 250 మిలియన్ డాలర్లు..
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ వైపు నుంచి అదనంగా 250 మిలియన్ డాలర్లు అందిస్తామని సియాటిల్లోని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇప్పటివరకు గేట్స్ ఫౌండేషన్ మొత్తం 1.75 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చింది.
ఇదీ చదవండి:కమలా హారిస్ అధికారిక నివాసం మార్పు-కారణమిదే?