గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఒక గ్రహశకలంపై ఖగోళ శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. శనివారం ఇది పుడమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' తెలిపింది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్షశిలగా అభివర్ణించింది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ఎలాంటి హాని ఉండబోదని పేర్కొంది. ఆ గ్రహశకలానికి '2016 ఏజే193' అని పేరు పెట్టారు. దాని వెడల్పు 4500 అడుగులు. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇది శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో దానికి, భూమికి మధ్య ఉన్న దూరం.. పుడమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని చెప్పారు. ఇది మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందన్నారు.
భూమివైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం! - భూమికి చేరువగా గ్రహశకలం
నేడు భూమికి చేరువగా గ్రహశకలం రానున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' తెలిపింది. గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహశకలం దూసుకొస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్షశిలగా అభివర్ణించింది.

భూమికి చేరువగా గ్రహశకలం
2016 జనవరిలో హవాయ్లోని పాన్స్టార్స్ అబ్బర్వేటరీ సాయంతో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఆ తర్వాత నాసా.. నియోవైస్ అనే వ్యోమనౌక సాయంతో దీన్ని నిశితంగా పరిశీలించింది. ఈ ఖగోళ వస్తువు చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందటంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు.