తెలంగాణ

telangana

By

Published : May 1, 2020, 3:11 PM IST

ETV Bharat / international

'మే'లో సడలింపులు ఇస్తే కరోనా మళ్లీ విజృంభించదా?

ప్రపంచాన్ని రెండు వైపుల నుంచి కరోనా మహమ్మారి తరుముతోంది. ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్​ వ్యాప్తి నియంత్రణలోకి రాకున్నా.. చాలా దేశాలు లాక్​డౌన్​ నిబంధనలను ఈ నెలలో సడలించాలని ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

VIRUS-WORLD
కరోనా

కరోనా విజృంభణతో కొన్ని నెలలుగా ప్రపంచదేశాలు లాక్​డౌన్​లో ఉన్నాయి. మహమ్మారిని మించి ఆర్థిక సంక్షోభం తలెత్తిన కారణంగా చాలా దేశాలు ఈ నెలలో ఆంక్షలు సడలించనున్నాయి. చైనా నుంచి అమెరికా వరకు లాక్​డౌన్లను ఎత్తివేయనున్న నేపథ్యంలో మళ్లీ కరోనా పడగ విప్పే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం..

వేర్వేరు దేశాల ఆర్థిక గణాంకాలు కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లకు చేరటం అక్కడి ప్రజల దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. తొలి త్రైమాసికంలో ఐరోపా ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 3.8 శాతం మేర పడిపోయింది.

ఫలితంగా ఆంక్షలు సడలించాలన్న ఒత్తిడి నేతలపై పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రించామా లేదా అన్న అనిశ్చితిలోనే ఉన్నా.. చాలా దేశాలు లాక్​డౌన్​ ఎత్తివేతకు సిద్ధమవుతున్నాయి.

లే- ఆఫ్​ సమస్య..

సమాచార సేకరణలో జాప్యం, వాస్తవ పరిస్థితులపై అనిశ్చితి కారణంగా గణాంకాల్లో తేడాలుండే అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన గణాంకాలకు మించి క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే ఆస్కారముంది.

అయినప్పటికీ.. ఉద్యోగాలు కోల్పోయినట్లు చెబుతున్న వారి సంఖ్య 4 వారాలుగా తగ్గుతుండటం కొంత ఊరటనిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాల్లో లే ఆఫ్​లు(పని కల్పించకపోవటం) పెరుగుతున్నాయని సెంచరీ ఫౌండేషన్ సీనియర్ అధికారి ఆండ్రూ స్టెట్నర్ అన్నారు.

అమెరికాలో ఆరుగురు ఉద్యోగుల్లో ఒకరు లే ఆఫ్ సమస్య ఎదుర్కొంటున్నారు. అంటే టెక్సాస్ రాష్ట్రం జనాభాను మించి వీరి సంఖ్య ఉంది. ఏప్రిల్​లో నిరుద్యోగ రేటు అమెరికాలో 20 శాతంగా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 1930 ఆర్థిక మాంద్యంలో 25 శాతం నిరుద్యోగం ఏర్పడింది. ఆ తర్వాత ఇదే అత్యధికం.

అమెరికాలో ఇలా..

అగ్రరాజ్యంలో కరోనా ధాటికి రోజూ వేలాది మంది మరణిస్తున్నారు. మరోవైపు వైరస్ తిరగతోడే ప్రమాదముందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత మంది యజమానులు, ఉద్యోగులు.. కార్యాలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తే తమ కుటుంబాలు ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగం కన్నా ప్రాణాలే ముఖ్యమని ఓమాహలోని హెయిర్​ స్టయిలిస్ట్ లాసే వార్డ్ అంటున్నారు. ఈ ఆరోగ్య సంక్షోభంలో పనికి తిరిగొచ్చే కార్మికులను గుర్తించటం కూడా సవాలేనని కొంతమంది యజమానులు చెబుతున్నారు. చాలా మంది ఉద్యోగులు స్పందించట్లేదని వాపోతున్నారు.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్​డౌన్​ను కొనసాగించాలని నిర్ణయించారు. మాల్స్, దుకాణాల్లో అందరూ విధిగా సంరక్షణ పరికరాలు ధరించాలని చెబుతున్నారు.

చైనాలో సాధారణ పరిస్థితులు..

చైనాలో వైరస్​ వ్యాప్తి భారీగా తగ్గిన కారణంగా.. పురాతనమైన ఫర్​బిడెన్​ సిటీని శుక్రవారం ప్రారంభించారు. కార్మిక దినోత్సవం సెలవుల నేపథ్యంలో భాగంగా మే 1 నుంచి 5 తేదీ వరకు అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే రోజుకు 5 వేల మంది పర్యటకులను మాత్రమే అనుమతించనున్నారు. కరోనాకు ముందు ఈ ఫర్​బిడెన్​ సిటీని రోజుకు 80 వేల మంది వరకు సందర్శించే వారు.

చైనా రాజధాని బీజింగ్​లో పార్కులు, ప్రదర్శనశాలలను ప్రారంభించారు. కానీ, పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో 3 కోట్ల జనాభా ఉన్న బీజింగ్ 3 నెలలపాటు లాక్​డౌన్​లో ఉంది.

మరికొన్ని దేశాల్లో..

  • మలేసియాలో చాలావరకు వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రధాని మహియిద్దీన్​ యాసిన్​ చెప్పారు. కొన్ని వారాలుగా దేశంలో ఇన్ఫెక్షన్లు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • థాయ్​లాండ్​లో పార్కులు, దుకాణాలు, క్షౌరశాలలు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం అమ్మకాలపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది.
  • బ్రిటన్​లో లాక్​డౌన్​ కొనసాగించేందుకే నిర్ణయించగా.. జర్మనీ, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్​లో ఆంక్షలు సడలించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి:అమెరికాలో కరోనాకు మరో 2 వేలమంది బలి

ABOUT THE AUTHOR

...view details