తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 7:11 AM IST

Updated : Oct 1, 2019, 1:05 PM IST

ETV Bharat / international

'హౌడీ మోదీ'తో ఆ దేశాలకు ట్రంప్​ హెచ్చరికలు!

అమెరికాలో 'హౌడీ మోదీ' నిర్వహించడం ఒక ఎత్తైతే.. స్వయంగా ఆ దేశాధ్యక్షుడు​ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక ఎత్తు. అగ్రరాజ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్​​ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి అమెరికా అధ్యక్షుడి నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? ఇది చైనా- పాకిస్థాన్​లకు ఓ బలమైన సందేశం ఇవ్వనుందా?

'హౌడీ మోదీ'తో ఆ దేశాలకు ట్రంప్​ హెచ్చరికలు!

'హౌడీ మోదీ..!' ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే హాట్​ టాపిక్​. మోదీ అమెరికా పర్యటనలో కీలక కార్యక్రమం ఈ హౌడీ మోదీ. ఈ వేడుకలో పాల్గొంటున్నట్టు ప్రకటించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు. అమెరికా చరిత్రలో ఓ అధ్యక్షుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అసలు ట్రంప్​ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

2020 అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారనడం సరికాదనే వాదనలు వినపడుతున్నాయి. చైనా- పాకిస్థాన్​ దేశాలకు గట్టి సందేశం ఇవ్వడానికే ట్రంప్​ హౌడీ మోదీలో పాల్గొంటున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో డ్రాగన్​ దేశం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరచడానికి ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

చైనా సైనిక సామర్థ్యం కూడా అమెరికాకు తలనొప్పిగా మారింది. దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని ప్రకటించి అమెరికా సహా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది చైనా. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యం తగ్గించాలని బలంగా కోరుకుంటోంది అమెరికా. ఈ వేటలో అమెరికాకు కనపడిన ప్రధాన మిత్రపక్షం.. భారత్​. జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలతో కలిసి చతుర్ముఖ రక్షణ వ్యూహం-క్వాడ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది అగ్రరాజ్యం. ఈ ప్రయత్నాలకు ఊతమివ్వడమూ 'హౌడీ మోదీ'కి ట్రంప్‌ హాజరు వెనుక ఉద్దేశం.

భారత్‌లో వ్యవసాయం, పాడి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా ప్రైవేటు బహుళజాతి కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ వ్యాపార బంధం పటిష్ఠం చేయాలని ట్రంప్‌ ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ దృష్టిలో చైనా-పాకిస్థాన్​ దేశాలు కవలలుగా కనపడుతున్నాయి. ఆర్టికల్​ 370 రద్దు అంశంలో పాకిస్థాన్​కు చైనా మద్దతుగా నిలవడమే ఇందుకు కారణం. చైనా, టర్కీ తప్ప మరే దేశమూ పాకిస్థాన్​కు మద్దతు పలకలేదు. అమెరికా సహా అనేక దేశాలు కశ్మీర్​ అంశం.. భారత్​ అంతర్గత విషయమని అంగీకరించాయి.

అఫ్గానిస్థాన్​లోని తాలిబన్లతో చర్చలు జరపడానికి పాకిస్థాన్​ కీలక పాత్ర పోషించింది. అందుకే పాక్​తో అమెరికా సంబంధాలు పెంచుకుంది. ఇప్పుడు తాలిబన్లతో అగ్రరాజ్య చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. తాలిబన్లపై సైనిక, దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని పాకిస్థాన్​పై ఒత్తిడి పెంచింది అమెరికా.

ఇటీవలి కాలంలో భారత్​తో అణు యుద్ధం గురించి అనేకసార్లు వ్యాఖ్యానించారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. దీంతో ఆగ్రహించిన ట్రంప్​ ప్రభుత్వం.. పాక్​ను ఓ బాధ్యతా రహిత దేశంగా పరిగణిస్తోంది. 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించి పాకిస్థాన్​కు బలమైన సందేశాన్ని పంపారు ట్రంప్​.

--- సురేశ్​ బాఫ్నా, సీనియర్​ పాత్రికేయుడు.

Last Updated : Oct 1, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details