తెలంగాణ

telangana

బైడెన్​ వచ్చేశారు- మరి భారత్​కు లాభమేనా?

By

Published : Jan 21, 2021, 5:40 AM IST

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేశారు. మరి బైడెన్​ రాక భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బైడెన్​ పాలనలో ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండనున్నాయి? బైడెన్​కు భారత్​పై ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎప్పటినుంచో ఊరిస్తున్న వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారా? పరిశీలకులు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దాం..

PRESIDENTIAL POLLS
బైడెనే వచ్చారు- మరి భారత్​కు లాభమేనా?

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. ఏ పార్టీ విజయం సాధించినా భారత్​-అమెరికా మధ్య సంబంధాలు దృఢంగానే ఉంటాయని పరిశీలకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. డొనాల్డ్​ ట్రంప్​, జో బైడెన్​లలో ఎవరు గెలిచినా.. భారత్​పై ప్రతికూల ప్రభావం ఉండదని ఎన్నికల ముందు చెప్పుకొచ్చారు.

మరి జో బైడెన్​ గెలుపొందారు. అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఈ నేపథ్యంలో బైడెన్​ నియామకం ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రచారంలో ఈ డెమొక్రాటిక్​ నేత వ్యాఖ్యలను వింటే ద్వైపాక్షిక సంబంధాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా.. మరింత బలోపేతం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇంకొన్ని విషయాలను పరిశీలిస్తే..

అణు ఒప్పందంలో బైడెన్​ పాత్ర..

జో బైడెన్​.. భారత్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటున్నారు. డెలవేర్‌ సెనేటర్‌గా పనిచేసిన మూడు దశాబ్దాల కాలంలోనూ, బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎనిమిదేళ్ల సమయంలోనూ భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించిన రికార్డు జో బైడెన్‌కు ఉంది. రిపబ్లికన్ల పరిపాలనలో భారత్‌- అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడంలో బైడెన్ కీలకపాత్ర పోషించారు. ఇదే సమయంలో భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. మొదటి నుంచి భారత్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు బైడెన్​.

అదే అతిపెద్ద విజయం..

గతేడాది జులైలో జరిగిన ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో భారత్​-అమెరికా సహజ భాగస్వాములని బైడెన్ వ్యాఖ్యానించారు. భారత్​తో సంబంధాలను.. వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించిన బైడెన్.. భద్రతకు సంబంధించి అవసరమైన, ముఖ్యమైన మిత్రుడిగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్- అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడంలో తనపాత్రపట్ల గర్వపడుతున్నట్లు బైడెన్ పలు సందర్భాల్లో చెప్పారు. భారత్ అమెరికా అణు ఒప్పందాన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎనిమిదేళ్ల కాలంలో తాను సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఒబామా హయాంలో భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పిన బైడెన్.. అధ్యక్షుడైన తర్వాత భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రచారంలోనే నొక్కిచెప్పారు. బైడెన్.. భారత్​కు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ వ్యాఖ్యలు తెలియజేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వారిని గమనిస్తే..

తన హయాంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యస్నేహితుడిగా మారిపోయారు డొనాల్డ్​ ట్రంప్​. మరి ఇప్పుడు జో బైడెన్​ ఇదే బాటలో మోదీతో చెలిమి, భారత్​తో​ సత్సంబంధాలను కొనసాగిస్తారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:బైడెన్ రాకతో భారత్​లో తగ్గనున్న పెట్రో ధరలు!

స్వల్ప భేదాలు ఉన్నప్పటికీ..

అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న అంశంపై ఆధారపడి ద్వైపాక్షిక సంబంధాలు ఉండవన్న అధికారులు.. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఇటీవలి కాలంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కొన్ని అంశాల్లో స్వల్ప బేధాలు ఉన్నప్పటికీ రెండు దేశాల ఉమ్మడి జాతీయ ప్రయోజనాలైన ప్రజాస్వామ్యం, చైనా నుంచి ఎదురయ్యే ముప్పు అంశాలకు ఇరుదేశాలు ప్రాధాన్యమిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

ట్రంప్​ విఫలం.. మరి బైడెన్​..

గత మూడు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే ఒబామా హయాంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు నేటికి అలానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ పాలనలో రక్షణ, ఎనర్జీ అంశాలు.. ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలలో ప్రధానాంశాలుగా నిలిచాయి. వీటితో పాటు కరోనా దృష్ట్యా ఆరోగ్య రంగంలో పరస్పర సహకారం, కలిసి పనిచేయడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. అయితే ద్వైపాక్షిక వాణిజ్యం, విదేశీయులకు ఇచ్చే పనివీసాలకు సంబంధించిన అంశాలలో ఎలాంటి పురోగతి లేదు. ఇదే సమయంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైంది. ఇరుదేశాల ఉన్నతాధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ.. మినీ ట్రేడ్ డీల్‌ సైతం కుదుర్చుకోలేకపోయింది. ఫలితంగా ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని ఏకైక పెద్ద దేశంగా భారత్ మిగిలింది. ఈ నేపథ్యంలోనే బైడెన్​ హయాంలో వాణిజ్య ఒప్పందంపై దృష్టిసారించే అవకాశాలున్నట్లు పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా బైడెన్​... వేగంగా అడుగులు వేస్తారని చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే జరిగిన చర్చలను అధికారులు తిరిగి ప్రారంభిస్తారని చెబుతున్నారు. రక్షణ రంగ పరికరాల కొనుగోళ్లకు సంబంధించి భారత్ మరిన్ని ఆర్డర్లు చేస్తుందని.. ద్వైపాక్షిక ఎనర్జీ ట్రేడ్‌ను ఇరుదేశాలు మరోస్థాయికి తీసుకుపోతాయని చెబుతున్నారు.

ఇవి కూడా..

బైడెన్​ ప్రభుత్వంలో.. వాతావరణ మార్పు అంశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్న ప్రాధాన్యాంశాల్లోకి చేరుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇంకా బైడెన్​- హారిస్​‌ యంత్రాంగం.. మానవహక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషిస్తున్నారు.

చైనా దూకుడుకు కళ్లెం!

పెరుగుతున్న నిరంకుశత్వ ధోరణులకు వ్యతిరేకంగా తొలి ఏడాదిలోనే ప్రజాస్వామ్య దేశాలతో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తానని బైడెన్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సదస్సులో.. ఎన్నికల్లో భద్రత, మానవహక్కులపై చర్చిస్తానని వెల్లడించారు. దీనిలో భారత్ కీలకపాత్ర పోషించే అవకాశముంది.

ఇదీ చూడండి:తొలి రోజే 12 కీలక దస్త్రాలపై బైడెన్​ సంతకం!

ABOUT THE AUTHOR

...view details