తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2020, 10:59 AM IST

ETV Bharat / international

వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌దే కీలక పాత్ర: ఫౌచీ

కరోనా వ్యాక్సిన్​ తయారీలో భారత్​దే కీలక పాత్ర అని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేస్తున్న దేశం భారత్​ అని గుర్తుచేసిన ఫౌచీ.. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్​ కోసం అమెరికాలోని సంస్థలు భారత్​తో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

India plays a key role in developing corona vaccine: Fauci
వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌దే కీలక పాత్ర: ఫౌచీ

కొవిడ్‌-19పై చేస్తున్న పోరులో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత ప్రైవేటు రంగానిది కీలక పాత్ర అని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) గురువారం సాయంత్రం నిర్వహించిన ఆన్‌లైన్‌ సింపోజియంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌)తో పాటు ఇతర కీలక సంస్థలు భారత్‌తో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తామన్నారు. సమర్థమైన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులను కలుపుకొని పోతామన్నారు. ఎన్ఐహెచ్‌లో భాగమైన అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ(ఎన్‌ఐఏఐడీ)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఫౌచీ అమెరికాలో కొవిడ్‌ కట్టడికి ట్రంప్‌ ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు.

తయారీలో జాప్యాన్ని ఇలా తగ్గించొచ్చు...

వ్యాక్సిన్‌ సమర్థతపై ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు.. అనంతరం దాని తయారీ మధ్య జాప్యాన్ని తగ్గించేందుకు ఉన్న మార్గాలను ఫౌచీ ఈ సందర్భంగా సూచించారు. వ్యాక్సిన్‌ ఆమోదానికి ఉన్న నియంత్రణా ప్రమాణాలు-సమీక్షలు; వ్యాక్సిన్‌ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సమాచారాన్ని పెంపొందించడం-దాన్ని సమన్వయపరచడం; మరింత సమర్థమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తికి నిధులు సమకూర్చడం- ఈ అంశాల్లో కాలయాపన జరగకుండా ఉంటే ప్రయోగ దశను దాటుకొని అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని ఫౌచీ స్పష్టం చేశారు.

వ్యాక్సిన్‌ తయారీ వేగవంతానికి ఆ విధానం అవసరం లేదు..

వ్యాక్సిన్‌ను అత్యంత వేగంగా అందుబాటులోకి తేవడానికి ఉన్న మార్గాలపై ప్రస్తుతం మేధావి వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందులో ఒకటి 'హ్యూమన్‌ ఛాలెంజ్‌ ట్రయల్స్'. ఈ విధానంలో.. ప్రయోగాల్లో భాగంగా వ్యాక్సిన్‌ను తీసుకున్న వాలంటీర్లకు కావాలనే వైరస్‌ సోకేలా చేస్తారు. తద్వారా వారు సహజంగా వైరస్‌ సోకే వరకు వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఇది వ్యాక్సిన్‌ తయారీ పరిశోధనల్ని వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొవిడ్‌-19 టీకా తయారీలోనూ ఈ విధానాన్ని అవలంబించాలన్న ఓ వర్గపు వాదనను ఫౌచీ వ్యతిరేకించారు. కరోనా వైరస్‌పై మరింత లోతైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కొవిడ్‌-19 కట్టడికి ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన చికిత్స అందుబాటులో లేదన్నారు. ఈ నేపథ్యంలో 'హ్యూమన్‌ ఛాలెంజ్‌ ట్రయల్స్‌' ఆమోదనీయం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-సరైన వెంటిలేషన్‌ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే!

ABOUT THE AUTHOR

...view details