వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలపై తాజాగా ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుత, అహింసా మార్గంలో చేపట్టే నిరసనలను గౌరవించాలని ఐరాస అభిప్రాయపడింది. 'ఈ విషయంపై అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా.. శాంతియుత నిరసనలు, స్వేచ్ఛా సమావేశాలు, అహింసా మార్గాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను' అని సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ అధికార ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ వెల్లడించారు.
300 మంది పోలీసులకు గాయాలు..
ట్రాక్టర్ పరేడ్లో భాగంగా దిల్లీలో జరిగిన ఆందోళనల్లో దాదాపు 300మందికి పైగా పోలీసులు గాయపడగా, ఓ వ్యక్తి మరణించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. అయితే, రైతుల హింసాత్మక ఘటనలకు నిరసనగా పోలీసు కుటుంబాలకు చెందిన దాదాపు 1500మంది బుధవారం ఆదాయపు పన్ను కార్యాలయం కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఇక ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన రైతు సంఘాలు, ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే దిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమయ్యిందని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు.
మరోవైపు, దిల్లీలో జరిగిన ఘటనలకు తమకు సంబంధం లేదని ఇప్పటికే 41 రైతుల సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ర్యాలీలో భాగంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు అన్ని రైతు సంఘాలతో గురువారం సమావేశం కానున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:ఎర్రకోటలో విధ్వంసానికి సాక్ష్యాలివి...