తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 5:38 AM IST

ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 25 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విశ్వరూపం కొనసాగుతోంది. వివిధ దేశాల్లో కలిపి 64 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 5 వేల మందికిపైగా మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1.70 లక్షలు దాటింది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ఇటలీ ప్రకటించింది. న్యూయార్క్​లో తొలిసారి 500 కన్నా తక్కువ మరణాలు సంభవించినట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

corona news world
కరోనా

ప్రపంచంపై కొవిడ్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య 25 లక్షలకు చేరువైంది. మొత్తం మరణాలు 1.7 లక్షలు దాటిపోయింది. 6,45,019 మంది వైరస్ బారి​ నుంచి కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా 7.8 లక్షల కేసులు నమోదుకాగా.. స్పెయిన్​లో ఈ సంఖ్య 2 లక్షలు దాటింది. గత 24 గంటల వ్యవధిలో 64 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 5,102 వేల మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు

ఫ్రాన్స్​లో 547

ఫ్రాన్స్​లో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా 547 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 20,265కి చేరినట్లు వైద్య శాఖ అధికారి జెరోమీ సాలోమోన్ ప్రకటించారు. ఓ బాధాకరమైన మైలురాయిని ఫ్రాన్స్ అధిగమించినట్లు జెరోమీ పేర్కొన్నారు. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడాన్ని స్వాగతించారు.

ఇటలీలో తగ్గుముఖం!

ఇటలీలో తొలి కరోనా కేసు నమోదైన తర్వాత మొదటిసారి బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు ప్రకటించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఈ నెలలోనే అతి తక్కువ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1,08,237 మంది చికిత్స నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.

వైరస్​ కారణంగా గడిచిన 24 గంటల్లో 454 మంది బాధితులు మరణించినట్లు ఇటలీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మృతుల సంఖ్య 24,114కి చేరినట్లు వెల్లడించారు.

అమెరికాలో ఉగ్రరూపం

కరోనాతో అమెరికా అతలాకుతలమవుతోంది. కొత్తగా నమోదైన 21,777 కేసులతో.. వైరస్​ సోకిన వారి సంఖ్య 791,625కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,473 మంది మరణించగా.. మృతుల సంఖ్య 42 వేలు దాటింది.

అగ్రరాజ్యంలో వైరస్ విలయానికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్​లో మరో 478 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,347కి చేరింది. అయితే గత మూడు వారాల వ్యవధిలో 500 కన్నా తక్కువ మరణాలు నమోదు కావడం ఇదేనని అధికారులు తెలిపారు. న్యూయార్క్​లో గత ఆరు రోజులుగా వైరస్ మృతుల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి:కరోనా కలవరం: దేశంలో 559కి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details