ప్రపంచదేశాలను కరోనా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు, మరణాలు అంతకంతకూ విజృంభిస్తూనే ఉన్నాయి. అమెరికాపై ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలో ఆ దేశంలో రికార్డు స్థాయి మరణాలు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే అక్కడ 2,108 మందిని బలితీసుకుంది కరోనా. కేసులు 5 లక్షలు మించిపోయాయి.
మొత్తం అమెరికాలో ఇప్పటివరకు 18,747 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల పరంగా ఇటలీని(18,849) త్వరలోనే దాటనుంది అగ్రరాజ్యం. స్పెయిన్లో 16081, ఫ్రాన్స్లో 13197 మంది మరణించారు.
ఆ దేశాల కంటే ఎక్కువ...
వైరస్కు హాట్స్పాట్గా ఉన్న ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కేసులు లక్షా 70వేలు దాటాయి. ఇతర దేశాలతో పోల్చుకున్నా ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక్కడ 7,800పైగా చనిపోయారు. న్యూజెర్సీలో దాదాపు 2000 మరణాలు సంభవించాయి.
కరోనా విజృంభిస్తున్నా.. అమెరికాలో మరణాలు 60 వేల దిగువనే నమోదవుతాయని తాజా అధ్యయనాలను ఉటంకించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గతంలో శ్వేతసౌధం- కరోనా వైరస్ కార్యదళం.. దేశంలో మరణాలు లక్ష నుంచి 2 లక్షలు మధ్య నమోదవుతాయని అంచనా వేసింది.
ప్రస్తుత కరోనా పరిస్థితులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశగా పయనిస్తోందని నిపుణులు అంటున్నారు.
చైనా..
కరోనాకు కేంద్రమైన చైనాలో శుక్రవారం మరో 46 కేసులు నమోదయ్యాయి. ఇందులో 42 మంది విదేశీయులే. మరో ముగ్గురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,339కి చేరింది.