తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్లాయిడ్​ మృతికి సంతాపం- నిందితులకు బెయిల్ - చౌవిన్‌ నేరం రుజువైతే గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో పోలీసుల దాష్టీకానికి బలైన నల్లజాతీయుడు ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పలు నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి హింస తలెత్తలేదు. మినియాపొలీస్‌లో జరిగిన జార్జ్‌ ఫ్లాయిడ్ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు, మానవహక్కుల సంఘాల ప్రతినిధులు హాజరై ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్లాయిడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మరో వైపు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అభియోగం ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులకు కౌంటీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Floyd mourned, celebrated as death used as call to action
ఫ్లాయిడ్​ మృతికి సంతాపం.. నిందితులకు బెయిల్

By

Published : Jun 5, 2020, 1:05 PM IST

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ నిరసనకారులు నినదించారు. న్యూయార్క్‌లో వేలాది మంది.. ఆరోగ్య సిబ్బంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారుల కంటే జాతివివక్ష ప్రమాదకరమైందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి ఓ దుండగుడు దాడికి యత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా, దుండగుడి పరిస్థితి విషమంగా ఉంది. న్యూయార్క్‌లో వేలాది మంది పోలీసులను వీధుల్లో మెహరించారు. మార్పుకు, ఆశకు ప్రతినిధులం తామే అని, శాంతియుతంగా ఆందోళనలు కొనసాగించాలని, అనేక నగరాల్లో పోలీసులు మోకాళ్లపై నిల్చుని అభ్యర్థిస్తున్నారు.

పోలీసుల సస్పెన్షన్​

న్యూయార్క్‌లో పోలీసుల తీరు మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లాయిడ్‌ ఆందోళనల్లో పాల్గొన్న 75 ఏళ్ల ఓ వృద్ధుడిని ఇద్దరు పోలీసులు నెట్టేశారు. దీనితో ఆయన తలకు తీవ్రగాయమై రక్తం కారింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈ వీడియో చూసి చాలా బాధపడ్డానని బఫెలో మేయర్ బైరాన్ బ్రౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతియుత నిరసనలు చేస్తోన్న వారిపై... పోలీసులు ప్రవర్తించిన తీరు నిరాశపరిచిందని మేయర్‌ తెలిపారు.

ప్రముఖుల సంతాపం

మినియాపొలీస్‌లో జరిగిన జార్జి ఫ్లాయిడ్ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు, మానవహక్కుల సంఘాల ప్రతినిధులు హాజరై ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో జాతి వివక్షకు చోటు లేదని, నల్ల జాతీయుల జీవించే హక్కును ఎవరూ అపహరించలేరని ప్రముఖులు పేర్కొన్నారు.

బెయిల్​ మంజూరు

ఫ్లాయిడ్ హత్య కేసులో అభియోగం నమోదైన ముగ్గురు పోలీసు అధికారులకు... కౌంటీ జిల్లా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. హెన్నెపిన్ కౌంటీ జిల్లా కోర్టుకు ముగ్గురు నిందితులు తొలిసారి హాజరుపరచగా... ప్రధాన నిందితుడు డెరిక్‌ చౌవిన్‌ను కోర్టులో హాజరుపరచలేదు. మిన్నెసోటా కోర్టుల్లో తొలిసారి నిందితులు హాజరైనప్పుడు వాంగ్మూలం నమోదు చేయరని, ఇది క్లుప్త విచారణ అని, తదుపరి విచారణ జూన్ 29కి వాయిదా పడిందని అధికారులు తెలిపారు. హత్య కేసులో చౌవిన్‌ నేరం రుజువైతే గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు తెలిపారు. మిన్నెసోటా చట్టం ప్రకారం హత్యకు సహకరించడం కూడా తీవ్ర నేరమేనని, ముగ్గురు పోలీసుల అధికారులకు కూడా చౌవిన్‌కు పడే శిక్షలే పడతాయని తెలిపారు. చౌవిన్‌ను న్యాయస్థానంలో ఎప్పుడు హాజరుపరుస్తారో ఇంకా నిర్ణయించలేదు.

ఇదీ చూడండి:ట్రంప్, బిడెన్​ మెయిళ్లు హ్యాక్​.. చేసింది ఆ దేశాలే!

ABOUT THE AUTHOR

...view details