తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ ప్రమాణానికి సొంత సిబ్బంది నుంచే ముప్పు!

బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భద్రతా సిబ్బంది నుంచే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సైనికాధికారులు హెచ్చరిస్తున్నారు. అంతరంగిక వ్యక్తులు దాడికి పాల్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై అధికారులు పర్యవేక్షణ పెంచారు. మరోవైపు, క్యాపిటల్ దాడిలో ట్రంప్ క్యాంపెయిన్​ సిబ్బంది హస్తం ఉందని రికార్డుల్లో వెల్లడైంది.

By

Published : Jan 18, 2021, 5:37 PM IST

FBI vetting Guard troops in DC amid fears of insider attack
బైడెన్ ప్రమాణానికి సొంత భద్రతా సిబ్బంది ముప్పు!

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసే ప్రమాణస్వీకార కార్యక్రమంలో అంతరంగిక వ్యక్తులు దాడికి పాల్పడే అవకాశం ఉందని సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రమాణస్వీకార మహోత్సవానికి కొద్ది గంటలు మిగిలి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ కార్యదర్శి ర్యాన్ మెకార్తీ సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రమాద ముప్పు గురించి తమకు అవగాహన ఉందని, అయితే ఇప్పటివరకు అలాంటి సూచనలు కనిపించలేదని స్పష్టం చేశారు. కార్యక్రమం కోసం విధుల్లో ఉన్నవారందరినీ నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. అంతర్గతంగా తలెత్తే దాడిని పసిగట్టడంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, సాధారణ ప్రమాణస్వీకారాలతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇందుకోసం కోసం కేటాయించిన 25 వేల మంది నేషనల్ గార్డ్​ సిబ్బంది వాషింగ్టన్​కు చేరుకుంటున్నారు. ఆర్మీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్​బీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వాషింగ్టన్​కు వస్తున్న ప్రతిఒక్క నేషనల్ గార్డ్​ను పరిశీలిస్తున్నారు.

అయితే ఎలాంటి ప్రమాదాన్నైనా పసిగట్టేందుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని నేషనల్ గార్డ్ బ్యూరో చీఫ్ జనరల్ డేనియెల్ ఆర్ హోకాన్సన్ స్పష్టం చేశారు. రాజధానిలో భద్రతను సమీక్షించారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి 'సీక్రెట్ సర్వీస్' బ్యూరో ఇంఛార్జిగా వ్యవహరిస్తోంది. కాగా, నేషనల్ గార్డ్స్, ఎఫ్​బీఐ, వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్యాపిటల్ పోలీసులు, యూఎస్ పార్క్ పోలీసులు ఈ కార్యక్రమానికి భద్రత కల్పిస్తున్నారు.

ట్రంప్ వర్గం హస్తం!

క్యాపిటల్ దాడిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ క్యాంపెయిన్​కు చెందిన సభ్యుల ప్రమేయం ఉందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్​కు మద్దతిచ్చే 'ఉమెన్ ఫర్ అమెరికా ఫస్ట్' అనే బృందం 'సేవ్ అమెరికా' పేరిట జనవరి 6న శ్వేతసౌధానికి సమీపంలో ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న దాదాపు ఆరుగురు సిబ్బందికి కొన్ని వారాల క్రితం ట్రంప్ క్యాంపెయిన్ నుంచి వేల డాలర్లు అందాయని నేషనల్ పార్క్ సర్వీస్ రికార్డుల ద్వారా తేలింది. ర్యాలీలో పాల్గొనాలని అనుకున్న మరికొందరికి శ్వేతసౌధంలోని అధికారులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.

ర్యాలీ నిర్వహించేందుకు అవసరమైన నిధులు ఎలా సేకరించారనే విషయంపై ఈ బృందం స్పష్టత ఇవ్వలేదు. అయితే ట్రంప్ క్యాంపెయిన్ మాత్రం.. తమ నుంచి ఎలాంటి నిధులు వెళ్లలేదని చెబుతోంది. క్యాంపెయిన్​కు సంబంధం ఉన్న ఏ ఒక్కరు కూడా ర్యాలీలో పాల్గొనలేదని పేర్కొంది. ఎవరైనా మాజీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నప్పటికీ.. అది తమ ఆదేశాలతో జరగలేదని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details