తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2021, 7:32 AM IST

ETV Bharat / international

కరోనాతో పారా హుషార్.. టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరి!

'వ్యాక్సిన్​ తీసుకున్నాక ఇక కరోనా సోకదు.. మాస్క్​ పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు' అనే అపోహలోనే ఉన్నారు చాలా మంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం తీసుకున్న నిర్ణయం.. పరిస్థితి మళ్లీ మొదటి దశకే వచ్చిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. టీకా రెండు డోసులు వేసుకున్నవారు కూడా మాస్కులు ధరించాలన్న ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

america, masks
మాస్కులు, అమెరికా

పూర్తిగా వ్యాక్సినేషన్​ చేయించుకున్న దేశ ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరించింది అమెరికా. ఆ తర్వాత చాలా మంది మాస్కులను విసిరేస్తూ.. ఫొటోలకు పోజులు ఇచ్చారు. అవి వైరల్​గానూ మారాయి. కానీ ఇప్పుడు సీన్​ రివర్స్​ అయ్యేలా కనిపిస్తోంది. టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాస్కులు అవసరం లేదని చెప్పిన సీడీసీ(వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం).. ఇప్పుడు మార్గదర్శకాలను మారుస్తోంది. ఎందుకిలా? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? టీకా రెండు డోసులు తీసుకున్నా వైరస్​ సోకుతుందా? ఈ పరిణామాలకు డెల్టా వేరియంట్​కు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు స్పష్టత ఇచ్చారు శాన్​ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ చిన్ హాంగ్.

వ్యాక్సిన్​ తీసుకున్నా మాస్క్​ ధరించడం ఎందుకు?

మాస్క్​లు .. కరోనా వైరస్​ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకుంటాయి. గాలిలోని ఇతర వైరస్​లూ సోకకుండా లేయర్​లా పనిచేస్తాయి. వ్యాక్సిన్​ తీసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నది వాస్తవమే. కానీ వైరస్​ సోకే ప్రమాదం పూర్తిగా తప్పినట్టు కాదు. అందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్​ రూపాంతరం చెందడం కూడా ఇందుకు ఓ కారణమే. డెల్టా వేరియంట్​ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే.. సాధారణ ప్రజల్లాగే.. వ్యాక్సిన్​ తీసుకున్నవారికీ వైరస్​ సోకి. వారి నుంచి వ్యాప్తి కూడా జరుగుతోందని సీడీసీ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఈ మార్గదర్శకాలు ఎక్కడ వర్తిస్తాయి?

అమెరికాలో.. గత వారంలో 8 శాతానికి మించి పాజిటివ్​ కేసులు నమోదైన ప్రాంతాల్లో లేదా ప్రతి లక్ష మందిలో 50కి పైగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది సీడీసీ.

లాస్​ ఏంజెలిస్​​లో జులై మధ్య వారానికి 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీడీసీ తమ మార్గదర్శకాలను సవరించింది. 63శాతం ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది.

ఇదీ చదవండి:టీకా తీసుకుంటే మాస్క్ అవసరం లేదా?

డెల్టా వేరియంట్​తో పరిస్థితులు ఎలా మారుతున్నాయి?

మొదటి డోసు మాత్రమే తీసుకున్న వారిలో.. రూపాంతరం చెందుతున్న వైరస్​ వ్యాప్తి తీవ్రమవుతోందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఫైజర్ టీకా తొలి డోసు డెల్టా వేరియంట్​పై 34 శాతమే పనిచేస్తోందని, ఆల్ఫా వేరియంట్​పై ఇది 51 శాతం పనిచేసిందని మరికొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే రెండు డోసుల అనంతరం ఫైజర్​ మెరుగ్గా పనిచేస్తుందని తెలిపాయి.

2021 జనవరి నుంచి ఏప్రిల్​ మధ్యలో డెల్టా వేరియంట్​ వ్యాప్తికి ముందు.. ఫైజర్ టీకా సామర్థ్యం 97 శాతంగా ఉందని ఇజ్రాయెల్​ పేర్కొంది. అనంతరం అది 41శాతమేనని ఇజ్రాయెల్ అనూహ్య ప్రకటన చేసింది.

అయితే.. సింగపూర్​ సహా పలు దేశాల్లో టీకా తీసుకున్నవారూ వైరస్​ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కానీ, వీరిలో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. టీకా తీసుకున్నవారూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని పేర్కొంది.

ఏ పరిస్థితుల వల్ల అమెరికా మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది?

తొలుత.. డబ్ల్యూహెచ్​ఓ మార్గదర్శకాలను సీడీసీ అనుసరించలేదు. వ్యాక్సినేషన్​ శరవేగంగా జరుగుతుండటం, కరోనా వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుతుండటం వల్ల.. సీడీసీ తమ మార్గదర్శకాలు వెల్లడించింది. టీకా తీసుకున్నవారు మాస్కు ధరించకున్నా ఫర్వాలేదని తెలిపింది.

అయితే.. కొందరు నిపుణులు ఈ నిర్ణయంపై అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ.. జులై 27న బైడెన్​ కీలక ప్రకటన చేశారు. డెల్టా వేరియంట్​ ప్రమాదకారమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీడీసీ నూతన మార్గదర్శకాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

మళ్లీ మాస్కులు ధరించాలని హెచ్చరించడం సరైన నిర్ణయంగా నిపుణులు భావిస్తున్నారు. దీని అర్థం వ్యాక్సిన్​లు రక్షణ కల్పించవని కాదు. టీకా తీసుకున్నా మాస్క్ ధరించడం శ్రేయస్కరం.

టెస్టులూ తప్పవా?

స్వల్ప లక్షణాలున్నాయని అనిపిస్తే.. రెండు డోసుల టీకా తీసుకున్నవారైనా తప్పనిసరిగా టెస్టు చేయించుకోవాలని సీడీసీ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. డెల్టా వేరియంట్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details