తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇళ్లు ఖాళీ చేసి సినీ, క్రీడా ప్రముఖుల పరుగులు - donald trump on california

కాలిఫోర్నియాలో కార్చిచ్చు వల్ల ప్రజలు విలవిలలాడిపోతున్నారు. విద్యుత్​ సరఫరా నిలిచిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. సినిమా, క్రీడా ప్రముఖులకూ కార్చిచ్చు సెగ తాకింది.

కార్చిచ్చుతో అల్లాడిపోతున్న కాలిఫోర్నియా

By

Published : Oct 30, 2019, 4:42 PM IST

Updated : Oct 30, 2019, 7:00 PM IST

ఇళ్లు ఖాళీ చేసి సినీ, క్రీడా ప్రముఖుల పరుగులు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అంధకారంలో చిక్కుకుంది. అత్యంత వేగంతో వీస్తున్న వేడి గాలుల కారణంగా పసిఫిక్​ గ్యాస్​ అండ్​ ఎలక్ట్రిక్​ సంస్థ(పీజీ అండ్​ ఈ) విద్యుత్​ సరఫరాను నిలిపివేసింది. విద్యుత్ తీగల వల్ల మరిన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ అంతరాయం కారణంగా అనేక ఇళ్లు, వాణిజ్య కేంద్రాలు చీకటిగా మారాయి. ఉత్తర కాలిఫోర్నియా పరిధిలోని లక్షలాది మంది.. విద్యుత్​ వాహనాలు, చరవాణిల ఛార్జింగ్ కోసం విద్యుత్​​​ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

"నేను ప్రభుత్వ చర్యలపై నిరాశ చెందాను. విద్యుత్​ అంతరాయం కలిగించినందుకు ఈ మొత్తం పాలన మీద నాకు అసంతృప్తిగా ఉంది. కచ్చితంగా ఇదంతా కావాలని చేసే పని. దేశంలో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంటే ఇలాగే జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా సరే ఇలాగే ఉంటుంది."

-గెరాల్డ్​ ష్మావోనియన్​, గీజర్​విల్​ వాసి

తూర్పు శాన్​ఫ్రాన్సిస్కోలోని లాఫాయెట్​ టెన్నిస్​ క్లబ్​ను కార్చిచ్చు దహించివేసింది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. వారంతా మంగళవారం చీకటిలోనే గడపాల్సి వచ్చింది.

స్టార్లనూ తాకిన కార్చిచ్చు

మంటల ఉద్ధృతి కారణంగా లాస్​ ఏంజిల్స్​లో నివాసం ఉంటున్న ప్రముఖ బాస్కెట్​బాల్​ ఆటగాడు​ స్టార్​ లెబ్రాస్​ జేమ్స్​ సహా ప్రముఖలను ఆ ప్రాంతం నుంచి తరలించారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్​ జాన్​ సీనా అగ్నిమాపక సిబ్బంది కోసం 5లక్షల డాలర్లు విరాళం ఇస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపాడు.

వేల ఎకరాలు బూడిద

కార్చిచ్చు తీవ్రత వల్ల సొనోమా, ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతాల్లోని 15శాతం అడవి మంటల్లో కాలిపోయిందని అధికారులు తెలిపారు. భీకర అగ్నికీలలు ఇప్పటివరకు సుమారు 76వేల 138 ఎకరాలను ధ్వంసం చేశాయని వెల్లడించారు.

అగ్నికి 189 భవనాలు ఆహుతి..

ఉత్తర కాలిఫోర్నియాలో రాత్రికి రాత్రి కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. 118 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. దాదాపు 1.5లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు 189 భవనాలు మంటల్లో కాలిపోయాయి. అందులో ఎక్కువగా నివాసాలే ఉన్నాయి.

తీవ్రంగా శ్రమిస్తున్నా...

సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరుకైన రోడ్లు, నిటారుగా ఉన్న భూభాగం కారణంగా ప్రమాదం జరిగిన ప్రాంతాలకు వెళ్లడానికి సిబ్బందికి కష్టంగా ఉందని అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: బంగారం మింగిన ఎద్దు- బయటకు తీసేందుకు పాట్లు

Last Updated : Oct 30, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details