Biden Putin talks: అమెరికా- రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ వ్యవహారంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సంభాషణ జరిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్పై సైనికపరమైన చర్యలు చేపడితే, మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇదే జరిగితే అమెరికా- రష్యా మధ్య మైత్రి మరింత బలహీనపడుతుందని పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. తాజాగా రష్యా భారీ ఎత్తున బలగాలను మోహరించడం వల్ల సరిహద్దు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా- రష్యా దేశాధినేతల ఫోన్ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
US Russia relations: అమెరికా- రష్యాల మధ్య ఇప్పుడు రెండు దారులు ఉన్నట్టు, ఒకటి దౌత్యపరమైన మార్గమని, మరొకటి ఆంక్షలతో విరుచుకుపడటమని పుతిన్కు బైడెన్ తేల్చిచెప్పారు. 'ఉక్రెయిన్లో ఉద్రిక్తతలు తగ్గించాలని పుతిన్ను బైడెన్ కోరారు. అలా కాకుండా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేస్తే.. మిత్ర దేశాలతో కలిసి అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.' అని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.