ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు పలికారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన ఫోన్ సంభాషణలో కాల్పుల విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారని శ్వేతసౌధం తెలిపింది. .
తక్షణమే కాల్పుల విరమణను పాటించాలంటూ డెమొక్రాట్ చట్టసభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం నుంచి తాజా ప్రకటన రావడం గమనార్హం.
గాజాలోని హమాస్ వర్గాలు- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. ఇందులో చాలా మంది పాలస్తీనా ప్రజలే ఉన్నారు.
ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా.. ఈ దాడులను పూర్తిగా ఖండించలేదు. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ 15 దేశాలతో కూడిన ఐరాస భద్రతా మండలి ఉమ్మడి ప్రకటనను సైతం మూడు సార్లు అడ్డుకుంది. అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి జేక్ సలివన్ చెబుతున్నారు.