తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 2:11 PM IST

ETV Bharat / international

'ప్రియురాలి'పై చోక్సీ భార్య మాటేంటి!

మెహుల్​ చోక్సీ కిడ్నాప్​ ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని.. ఆయన ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బార్బరా జబరికా చేసిన వ్యాఖ్యలపై ఆయన భార్య ప్రీతీ చోక్సీ ఘాటుగా స్పందించారు. జబరికా చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని చెప్పారు. తన భర్తను తప్పుగా చూపించేందుకు పన్నిన కుట్రలో జబరికా హస్తం ఉందని ఆరోపించారు.

priti choksi on barbara jabarica
మెహుల్​ చోక్సీ కిడ్నాప్​

పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీ కిడ్నాప్​లో తన పాత్ర ఏమీ లేదని అయన ప్రియురాలిగా భావిస్తున్న బార్బరా జబరికా చేసిన వ్యాఖ్యలను వ్యాపారవేత్త భార్య ప్రీతీ చోక్సీ ఖండించారు. మెహుల్​ తనను తాను 'రాజ్'​ అనే పేరుతో పరిచయం చేసుకన్నాడని బార్బరా చెప్పటం.. పూర్తిగా అవాస్తవమని చెప్పారు. 'పిల్లలు కూడా గూగుల్​ వాడుతున్న ఈ కాలంలో మెహుల్​ చోక్సీని బార్బరా గుర్తుపట్టలేకపోయిందా?' అని ప్రశ్నించారు. తనతో మెహుల్​ చోక్సీ వాట్సాప్​ సంభాషణలు జరిపాడని బార్బరా చెప్పటంపై కూడా ప్రీతీ చోక్సీ తప్పుబట్టారు. ఫొటోషాప్​ వంటి సాఫ్ట్​వేర్​ సాయంతో వాట్సాప్​ సందేశాలను ఎవరైనా మార్చగలరన్నారు.

"ఈ కేసు చుట్టూ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇన్​స్టాగ్రామ్​లో లక్షలాది మంది అనుచరులు ఉన్న ఆమె(జబరికా)కు ఈ వార్తల గురించి తెలియదా? మెహుల్​ చోక్సీతో స్నేహం మాత్రమే చేశానని చెబుతున్న ఆమె.. ఎందుకు మరి తన స్నేహితున్ని కాపాడటానికి ఒక్క మాట మట్లాడలేదు. నా భర్త చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అవన్నీ అసత్యపూరితమైనవేనని ఎవరికైనా అర్థం అవుతుంది. తన గౌరవాన్ని పణంగా పెట్టి సదరు మహిళ గురించి మెహుల్​ చోక్సీ ఎందుకు తప్పుడు సమాచారాన్ని ఇస్తారు? జబరికా ఆరోపణలన్నీ నా భర్తను తప్పుగా చూపించడానికి జరుగుతున్న కుట్రలే."

- ప్రీతీ చోక్సీ, మెహుల్ చోక్సీ భార్య

జబరికాగా అందరూ పిలుస్తున్న ఆమె.. ఇంతవరకు తాను ఎక్కడుంటారోనన్న వివరాలు వెల్లడించలేదని ప్రీతీ చోక్సీ విమర్శించారు. అంతకుముందు.. ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకొంటున్న బలమైన వ్యక్తులు తనపై దాడి చేసి కొడుతుంటే జబరికా అడ్డుకోలేదని మెహుల్​ చోక్సీ చెప్పారు. తనను జబరికా ట్రాప్​ చేసిందని తెలిపారు.

'నాకేం సంబంధం లేదు..'

మరోవైపు మే 23న ఆంటిగ్వాలో మెహుల్​ చోక్సీ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు గుర్జీత్​ భండల్​ తనకు ఈ కిడ్నాప్​ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మే 23న ఉదయమే తాను ఆంటిగ్వా దీవులను వదలి వెళ్లానని చెప్పారు. తాను ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. అయితే.. ఇంతవరకు ఆంటిగ్వా పోలీసులు తనను సంప్రదించలేదని చెప్పారు. మెహుల్​ చోక్సీ తన కిడ్నాప్​పై ఆంటిగ్వా పోలీసులకు చేసిన ఫిర్యాదులో గుర్జిత్​ భండల్​ పేరును పేర్కొన్నారు.

భారతీయ బ్యాంకులకు సుమారు 13వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన మెహుల్​ చోక్సీ పరారై.. 2018 నుంచి ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఇటీవలే అక్కడ అదృశ్యమైన ఆయన.. పక్కనే ఉన్న డొమినికాలో పట్టుబడ్డారు. అక్కడి నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details