రోజూ రాత్రి... మేడపై నిద్రపోతూ.. ఆకాశంలో చూస్తుంటాం. మిలమిలా మెరిసే నక్షత్రాలు కళ్లకు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే వాటి మధ్యలో ఉన్న జాబిల్లి మాత్రం మన మనసు దోచేస్తుంది. ఎప్పటికైనా చందమామను అందుకోవాలనే కోరికో... లేక అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే.. అంటూ చిన్నప్పుడు పాడిన పాట గుర్తొచ్చో... అక్కడికి చేరాలనుకున్నాడు మనిషి.
మనిషి మేధస్సు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ... అందని దాని కోసం తపిస్తూనే ఉంటుంది. అలానే చందమామలోనూ భూమిలాంటి పరిస్థితులే ఉన్నాయేమో కనుక్కోవాలని తపన పడ్డాడు మనిషి. కానీ అక్కడకు వెళ్లాలంటే అనుకున్నంత సులభం కాదు. అందుకే మేధస్సుకు పదును పెట్టాడు.
నిరంతర కృషితో చల్లని జాబిల్లిపై అడుగు పెట్టేందుకు మార్గం కనుగొన్నాడు. అనుకున్నది సాధించాడు. చంద్రుడిపై చక్కర్లు కొట్టేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సార్లు నాసా ఆధ్వర్యంలో చంద్రుడిపై దండయాత్ర చేశాడు.
వెళ్లిన ప్రతిసారీ అక్కడి విశేషాలపై పరిశోధన చేస్తూ విజయుడయ్యాడు. ఆ విశేషాలను గుర్తు చేసుకుంటే మానవుడు సాధించలేనిదంటూ ఏదీ లేదేమో అనిపించక మానదు.
చంద్రుడిపై తొలి అడుగు
‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే కానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’... ఇవి 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై తొలి అడుగు మోపిన వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటలు.
1969 జులై 16న 'అపోలో 11' వ్యోమనౌక కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. ఇందులో ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్, బజ్ ఆల్డ్రిన్ చంద్రమండలంపైకి పయనమయ్యారు.
1969 జులై 20న వ్యోమనౌక చంద్రగ్రహాన్ని చేరింది. చంద్రుడిపై అడుగు పెట్టిన తొలి మానవుడిగా ఆర్మ్స్ట్రాంగ్ చరిత్రకెక్కారు. సుమారు 21 గంటల 36 నిమిషాల పాటు చంద్రమండలంలో గడిపారు. అక్కడి ఉపరితలం ఛాయా చిత్రాలను తీసుకొని తిరిగి పయనమయ్యారు.
195 గంటల 18 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ ప్రయాణం అది. యాత్రను విజయవంతంగా ముగించుకొని 1969 జులై 24న భూమిని చేరుకున్నారు. చంద్రునిపై మనిషి తొలిసారి కాలు మోపిన ఆ క్షణాలను అప్పట్లోనే 50 కోట్ల మందికి పైగా టీవీల్లో చూశారు.
గర్వించిన దేశం