తెలంగాణ

telangana

By

Published : May 13, 2020, 3:16 PM IST

ETV Bharat / international

లాక్​డౌన్ ఎత్తివేతలోనూ ట్రంప్​ సర్కార్​ 'నిర్లక్ష్యం'!

కరోనా విపత్తును మించి ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ట్రంప్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శల నడుమ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పునరుద్ధరణ ప్రణాళికల్లో ఆరోగ్య నిపుణులు చేసిన సిఫార్సులను శ్వేతసౌధం పట్టించుకోలేదని పలు నివేదికల ద్వారా వెల్లడైంది.

VIRUS-US-CDC
అమెరికా

కరోనాపై పోరాటం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ.... ప్రస్తుతం ప్రపంచం ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అనేక దేశాలు. కానీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అవేవీ లెక్కచేయకుండా ముందడుగు వేశారాయన. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపారు. ఆంక్షల సడలింపుపై రాష్ట్రాల వారీగా నిర్ణయాలు తీసుకునేందుకు గవర్నర్లకు అధికారాలిచ్చారు.

అయితే... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలోనూ ట్రంప్ సర్కార్​ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల కమిటీ స్పష్టంగా సూచించినా... ప్రభుత్వం బేఖాతరు చేసిందని తెలిసింది.

సీడీసీ సిఫార్సులు..

అమెరికాలో సురక్షితంగా వ్యాపార కార్యకలాపాలను ఎలా పునరుద్ధరించాలో సీడీసీ నిపుణులు సూచనలు చేశారు. భవిష్యత్తులో కరోనా కేసులు మళ్లీ పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వివరించారు.

అయితే ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్​ 30న ఈ సిఫార్సులను తిరస్కరించింది. నిపుణులు సూచించిన పత్రాలు ప్రచురణకు అనర్హమని గత వారం శ్వేతసౌధం ప్రకటించింది.

ప్రయాణాలకు సంబంధించి సీడీసీ సిఫార్సులు కాకుండా తేలికపాటి నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే సీడీసీ నిర్ణయాలతో శ్వేతసౌధ అధికారులు ఎంతలా విభేదిస్తున్నారో అర్థమవుతోంది.

ముందే చేసి ఉండాల్సింది..

సీడీసీ నిపుణులు ముందుగానే సిఫార్సు చేసి ఉండాల్సిందని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు స్టీఫెన్ మోర్స్ అభిప్రాయపడ్డారు. ముందుగానే వివరణాత్మక సూచనలు ఇచ్చి ఉంటే ప్రజలకు భరోసా ఇవ్వగలిగేవారమని, కేసులు కూడా తగ్గే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.

వేగం పనికిరాదు..

ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి అమెరికా అంటువ్యాధుల నిపుణుడు అంటోని ఫౌచీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దేశంలో కరోనా ఉద్ధృతితోపాటు మరణాలు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details