తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2021, 11:51 PM IST

ETV Bharat / international

'టీకాల మధ్య విరామంతో కొత్త వేరియంట్లు'

వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాల వల్ల కొత్తరకం కొవిడ్ వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచుతూ భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్రిటన్​లో ఈ తరహా ప్రయోగంతో కొత్త వేరియంట్ల బారిన పడినట్లు గుర్తించామని వివరించారు.

anthony fauci
ఆంథోనీ ఫౌచీ

కరోనా వ్యాక్సిన్‌ డోసులకు మధ్య విరామాన్ని పెంచడం వల్ల హానికరమైన కరోనా కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉంటుందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌచీ హెచ్చరించారు. గత నెలలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసుకు రెండో డోసుకు 6 నుంచి 8 వారాలుగా ఉన్న గడువును కేంద్రం 12 నుంచి 16 వారాలకు పెంచింది. ఇలా వ్యాక్సిన్‌ డోసుల మధ్య విరామం పెంచడం వల్ల ప్రజలు కరోనా కొత్త వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని ఫౌచీ తెలిపారు.

బ్రిటన్‌లో కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచడం వల్ల ప్రజలు కొత్త వేరియంట్ల బారినపడ్డారని గుర్తుచేశారు ఫౌచీ. కాబట్టి షెడ్యూల్‌ ప్రకారమే టీకాలను పంపిణీ చేయాలని సూచించారు. డెల్టా వంటి ప్రమాదకరమైన స్ట్రెయిన్లను అరికట్టేందుకు ఇదే మార్గమని అభిప్రాయపడ్డారు.

కరోనాతో పోరాడేందుకు టీకాలే అస్త్రాలన్న ఆయన.. ఒకసారి కరోనా బారినపడ్డవారికి కూడా టీకాలు వేయడం చాలా ముఖ్యమన్నారు. కరోనా మూడో దశను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని సూచించారు.

ఇవీ చదవండి:తప్పుడు లెక్కే భారత్‌ కొంప ముంచింది: ఫౌచీ

వుహాన్​ ల్యాబ్​ గుట్టు ఫౌచీకి నిజంగానే తెలియదా?

ABOUT THE AUTHOR

...view details