తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 12:54 PM IST

ETV Bharat / international

ఆ దేశాల్లో సబ్బు, శానిటైజర్​ అంటే తెలియదట!

రోగికి కృత్రిమ శ్వాస అందించడంలో వెంటిలేటర్లు కీలకపాత్ర పోషిస్తాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పలు దేశాలు వీటిని సమీకరించుకోవడం లేదా తయారు చేసుకోవడాన్ని ముమ్మరం చేశాయి. అయితే కొన్ని దేశాల్లో వెంటిలేటర్ అన్న పరికరమే లేదు. ఇది పక్కన పెడితే సాధారణ సబ్బులు, శానిటైజర్లు కూడా లేవంటే ఆశ్చర్యం కలగక మానదు.

africa
ఆఫ్రికా

శరీరంలో కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో రోగికి వెంటిలేటర్లపై కృత్రిమ శ్వాస అందించడం అత్యంత కీలకం. ఇదే చావో.. బతుకో తేలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇక్కడ చాలా దేశాల్లో కనీసం వెంటిలేటర్లు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మొత్తం 54 దేశాలకు గానూ 41 దేశాల్లోని వెంటిలేటర్ల సంఖ్యను కలిపితే దాదాపు 2,000 ఉంటాయి. వీటిల్లో 10 దేశాల్లో వెంటిలేటర్‌ అన్న పరికరమే లేదు. ఇక చాలా దేశాల్లో సాధారణ సబ్బులు, శానిటైజర్లు‌ కూడా వినియోగించరట.

విజృంభిస్తున్న కరోనా..

దక్షిణ సుడాన్‌లో కొవిడ్​-19‌ విజృంభిస్తోంది. అక్కడ 10 మంది మంత్రులూ ఈ వైరస్​ బారినపడ్డారు. ఈ మంత్రులు కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సభ్యుడిని కలవడం వల్ల వారికీ సోకింది. ఈ దేశానికి మొత్తం ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు. కానీ దేశం మొత్తంలో నాలుగు వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వీరిలో ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ మాచెర్‌కు కరోనా సోకింది. ఆయన భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దేశం మొత్తంలో 655 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. చాలా ఆఫ్రికా దేశాలలో కేసుల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది. గ్యునియాలో ప్రతి ఆరు రోజులకు, ఘనాలో ప్రతి తొమ్మిది రోజులకు కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో కనీస సదుపాయాలు లేని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆగని హింస..

ఆఫ్రికాలోని చాలా దేశాల్లో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఒక పక్క కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నా హింసాత్మక దాడులకు విరామం ఇవ్వడంలేదు. దక్షణ సుడాన్‌లో ఇటీవల రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణలో.. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్ల అంతర్యుద్ధానికి విరామం ఇస్తూ.. గత ఫిబ్రవరిలో ఒప్పందం జరిగింది. కానీ రెండు జాతుల మధ్య ఘర్షణలు మాత్రం ఆగలేదు. ఈ దాడుల్లో రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు, నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సహాయక చర్యలకు ఇవి కూడా అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో పాటు హింసాత్మక ప్రాంతాల నుంచి భారీగా వలసపోవడం కరోనా వ్యాప్తికి దోహదం చేస్తోందని కొందరు నిపుణులు వెల్లడించారు.

2 కోట్ల మందికి 11 వెంటిలేటర్లు..

పశ్చిమాఫ్రికా దేశాల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. బుర్కినా ఫాసో దేశంలో మొత్తం జనాభా రెండు కోట్లు. ఇక్కడ వెంటిలేటర్ల సంఖ్య 11. ఆఫ్రికా దేశాల్లో కనీసం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ పడకలు కూడా లేవు. 43 దేశాల్లో ప్రతి పది లక్షల మందికి 5 ఐసీయూ పడకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాతలు ఇచ్చిన వెంటిలేటర్లే వారిణి శరణ్యంగా మారాయి. చైనా దిగ్గజ కంపెనీ అలీబాబా అధినేత జాక్‌మా ఆఫ్రికా దేశాలకు 500 వెంటిలేటర్లను దానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details