Vaishnav Tej new movie : "ఫలానా జానర్ కథ చేయాలి.. పాన్ ఇండియా కథల్లో నటించాలని ప్రత్యేకంగా ప్రణాళికలేం లేవు. నా దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే నన్ను ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నా" అన్నారు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి.. తొలి ప్రయత్నంలోనే చక్కటి విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరో ఆయన. ఇప్పుడాయన కేతిక శర్మతో కలిసి 'రంగ రంగ వైభవంగా'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గిరీశాయ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో చిత్ర విశేషాలు పంచుకున్నారు వైష్ణవ్ తేజ్.
అరుదుగా వచ్చే కథ..
"దర్శకుడు గిరీశాయ ఈ కథ వినిపించగానే బాగా నచ్చేసింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడు చాలా నవ్వుకున్నాను. కథతో పూర్తిగా కనెక్ట్ అయ్యా. ఇందులో యువతరం మెచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకీ నచ్చే ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచన లేకుండా చేస్తానని చెప్పేశా".
అందుకే ఈ కథే ఒప్పుకొన్నా..
"ఈ చిత్రంలో నేను వైద్య విద్యార్థిగా కనిపిస్తా. నాకు కేతికకు మధ్య ఇగోతో సాగే చక్కటి ప్రేమకథ కనిపిస్తుంది. అందరూ ఇది 'ఖుషి', 'నిన్నే పెళ్లాడతా' ఫ్లేవర్లో కనిపిస్తోంది అంటున్నారు. నిజానికి దీనికి ఆ సినిమాలకు ఏ సంబంధం ఉండదు. ఇది పూర్తిగా కొత్త కథ. ఈ కథకే నేను కనెక్ట్ అవ్వడానికి కారణం గిరీశాయ ఈ స్క్రిప్ట్ను తీర్చిదిద్దిన తీరు. తప్పకుండా మంచి సినిమా అవుతుందనిపించింది".