Money Landering Case Jacqueline Fernandez: వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు చుక్కెదురైంది. ఈ ముద్దుగుమ్మకు చెందిన రూ.7.27కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్, అతడి భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. చంద్రశేఖర్.. జాక్వెలిన్కు విలువైన కానుకలు ఇచ్చినట్లు గుర్తించి ఆమెను గతంలో పలు మార్లు విచారించారు అధికారులు.
ఇదీ కేసు..రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.