ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. తన తదుపరి సినిమాలను త్వరత్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమాను తెలుగు, హిందీలో డైరెక్ట్ చేసిన తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. బాలీవుడ్లో తెరకెక్కుతున్నప్పటికీ ఈ చిత్రంపై తెలుగు ఆడియెన్స్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్ స్టర్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపందుతున్న ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్లో మొదలైంది. అప్పటి నుంచి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ అంతా కలిసి సెట్స్లో పార్టీ చేసుకుంది. డ్యాన్స్లు వేస్తూ సందడి చేసింది.
ఈ క్రమంలోనే మెగాపవర్స్టార్ రామ్చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలోని జిగేలు రాణి సాంగ్కు రణ్బీర్ కపూర్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రసుతం సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పాటతో పాటు పలు హిట్ సాంగ్స్కు కూడా రణ్బీర్ చిందులేశారు. షారుక్ ఖాన్ ఛయ్యా ఛయ్యా, హృతిక్ రోషన్ ఏక్ పల్ కా జీనా పాటలకు స్టెప్పులేశారు. ఈ వీడియోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో రణ్బీర్ చిందులేస్తుంటే మిగతా మూవీ టీమ్ అంతా కలిసి ఈలలు వేస్తూ గోల చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు తెగ లైక్స్, కామెంట్లతో సోషల్మీడియాను హోరెత్తించారు.
ఇకపోతే ఈ యానిమల్ సినిమా విషయానికొస్తే.. రష్మిక హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, సురేశ్ ఒబెరాయ్, పరిణితి చోప్రా కీలక పాత్రలు పోషించారు. టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ-1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, లీకైన ఫోటోలు సినిమాపై మంచి అంచనాలనే పెంచాయి.
ఇదీ చూడండి:పూజా రామచంద్రన్.. స్విమ్మింగ్ పూల్లో ముద్దులాటలు.. వీధుల్లో షికార్లు.. ప్రెగెన్సీలోనూ ఆగట్లేదుగా!