తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా పృథ్విరాజ్​ 'కడువా' టీజర్​.. 'డీజే టిల్లు' సీక్వెల్​ అప్డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పృథ్విరాజ్​ 'కడువా', 'డీజే టిల్లు' సీక్వెల్​, 'పరంపర' వెబ్​సిరీస్​, 'చార్లీ 777' చిత్రాల సంగతులు ఉన్నాయి.

By

Published : Jun 25, 2022, 5:48 PM IST

Updated : Jun 25, 2022, 10:31 PM IST

Cinema updates
కడువా

Prithviraj kaduva: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'కడువా'. సుప్రియా మేనన్‌, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు టీజర్‌ను యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం సమకూర్చగా.. అభినందన్‌ రామానుజం ఛాయాగ్రహణం అందిచారు.

DJ Tillu sequel: "ఏం చెప్పన్రా మార్కస్‌.. ఒక ల్యాండ్‌ ఉన్నది.. అది మన సొంతము.. మన పర్సనలు అనుకున్నా నేను. కాకపోతే ఊళ్లో వాళ్ల అందరి పేరు మీద ఉన్నది.." అంటూ తనదైన డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌తో 'డీజే టిల్లు'గా హిట్‌ కొట్టాడు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రం రానుందా?అంటే నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌ చూస్తే దాదాపు అవుననే సమాధానం వస్తోంది. దేవుడి ఫొటోల ముందు స్క్రిప్ట్‌ పుస్తకాన్ని ఉంచి పూజ చేసిన ఫొటోను పంచుకుంటూ 'మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ రౌండ్‌-2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ ఆగస్టు నుంచి మొదలవుతుంది' అంటూ ట్వీట్‌ చేశారు.

దీంతో ఆయన ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. 'డీజే టిల్లు2' అంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు నిర్మాత మధుర శ్రీధర్‌ కూడా ‘శుభాభినందనలు సోదరా.. పార్ట్‌-2 బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకోవాలి’ అంటూ సిద్ధు జొన్నలగడ్డ ట్విటర్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ రిప్లైతో ‘డీజే టిల్లు2’ గురించి శ్రీధర్‌ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ‘డిజే టిల్లు’కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. విమల్‌తో కలిసి సిద్ధు కూడా స్క్రిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నారు. టిల్లు పాత్ర కోసం తన నటన, ఆహార్యం మార్చుకున్నారు సిద్ధు. అదే యువతలో ట్రెండ్‌ అయ్యేలా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో నేహాశెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.30కోట్ల వసూళ్ల రాబట్టింది.

Parampara webseries season2: గతేడాది నెటిజన్లను అమితంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ‘పరంపర’ ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు కొనసాగింపు రానుంది. 'పరంపర2'గా వస్తున్న ఈ భాగం జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. నవీన్‌ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్‌, ఆకాంక్షసింగ్, ఇషాన్‌ వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించారు. సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు 'పరంపర' సమాధానాలు లభించాయి. మరి కొత్త సిరీస్‌లో ఆధిపత్యపోరు ఎలా ఉంటుందో చూడాలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు.

Charlie 777 movie: మూగజీవాలపై జరుగుతున్న హింసను తెలియజేస్తూ తెరకెక్కిన ఎమోషనల్‌ చిత్రం '777 చార్లీ'. కిరణ్‌ రాజ్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సినీ ప్రియులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. తాజాగా '777 చార్లీ' నుంచి చిత్రబృందం ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. ‘చార్లీ నువ్వే ఓ అద్భుతం’ అంటూ సాగే ఈపాటలో హీరోకి శునకంతో ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది చూపించారు. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గుప్తా, రక్షిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మించారు. రానా సమర్పణలో ఈసినిమా విడుదలైంది.

ఇదీ చూడండి:ఆకట్టుకుంటున్న దుల్కర్​ 'సీతారామం' టీజర్​.. బన్నీతో మూవీకి హరీశ్​ ప్లాన్​!

Last Updated : Jun 25, 2022, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details