తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2022, 12:27 PM IST

Updated : Jul 28, 2022, 12:34 PM IST

ETV Bharat / entertainment

"ఇంద్ర సినిమా వల్లే అది సాధ్యమైంది.. లేదంటే..'

Chiranjeevi Indra movie: బ్లాక్‌బస్టర్‌ సినిమా 'ఇంద్ర'లో తాను నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ . ఆ సినిమా సమయంలో జరిగిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలివీ..

Paruchuri about Indra movie
పరుచూరి ఇంద్ర

Chiranjeevi Indra movie: చిరంజీవి ఎవర్​గ్రీన్​ హిట్స్​లో ఇంద్ర సినిమా ఒకటి. డ్యాన్సులు, ఫైట్​లు, లుక్స్​ ఇలా అన్నింటిలోనూ అభిమానులు కొత్త చిరంజీవిని చూశారు. థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మరోసారి తెలిపారు. ఈ మూవీ విడుదలై ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పరుచూరి పలుకులు' వేదికగా ఆయన తన మదిలోని మాటల్ని బయటపెట్టారు. ఈ కథ చేయడానికి మొదట దర్శకుడు బి.గోపాల్‌, నిర్మాత అశ్వినీదత్‌ ఒప్పుకోలేదని.. చిరు మాట వల్లే అంగీకరించారని అన్నారు.

"ఇంద్ర' చేయకపోతే ఇప్పుడు మేము ఆ వైభవాన్ని అనుభవించేవాళ్లం కాదు. రెండు దశాబ్దాలైనప్పటికీ చిరు అభిమానులు, ఇతర సినీ ప్రియుల గుండెల్లో ఈ సినిమా చెరగని ముద్ర వేసుకొంది. ఇంద్ర ఇంతటి విజయాన్ని అందుకోవడానికి చిన్నికృష్ణ అందించిన కథ, కథనం, పరిచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, బి.గోపాల్‌ దర్శకత్వ ప్రతిభ.. ఎంత కారణమో చిరంజీవి నటన కూడా అంతే కారణం. ఇంతటి గొప్ప కథను మొదట బి.గోపాల్‌ వద్దనడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఆయన తెరకెక్కించిన గత చిత్రాలు 'నరసింహ నాయుడు', 'సమర సింహారెడ్డి'లో హీరో పాత్ర చిత్రీకరణ కాస్త ఈ సినిమాలో ఉన్నట్లే ఉంటుంది. కాబట్టి, మళ్లీ ఇలాంటిదే చేస్తే ఏమవుతుందోననే భయం వల్లే ఆయన వద్దన్నారు తప్ప.. కథ బాగోలేదని ఆయన ఎప్పుడూ అనలేదు. బి.గోపాల్‌, అశ్వినీదత్‌.. ఇంద్ర తెరకెక్కించడానికి సుముఖంగా లేనప్పుడు.. చిరంజీవి గారు మంచి కథ మిస్‌ అయిపోతున్నారే ఏం చేయాలా అని అనుకున్నా. అలాంటి సమయంలో ఓసారి చిరంజీవికి ఫోన్‌ చేసి.. 'కథ బాగా నచ్చింది. కాకపోతే గోపాల్‌, అశ్వినీదత్‌ సినిమా చేయడానికి భయపడుతున్నారు. ఏం చేయమంటారండి' అని అడిగాను. దానికి ఆయన.. 'వాళ్లిద్దరూ లేకుండా చిన్నికృష్ణను తీసుకొని రేపు నన్ను కలవండి. ఒకసారి కథ వింటాను' అన్నారు. మర్నాడు చిరుని కలిసి కథ చెప్పాం. ఫస్టాఫ్‌ కాగానే ఆయన కుర్చీలో నుంచి లేచి ప్రశాంతంగా కిళ్లీ వేసుకొని ఇక సెకండాఫ్‌ వినక్కర్లేదు. ఇది సూపర్‌హిట్‌ అవుతుందని అన్నారు. 'కథ విన్నాను. సినిమా హిట్‌ అవుతుంది. చేద్దాం' అని అశ్వినీదత్‌, గోపాల్‌కూ చెప్పారు. అలా ఈ సినిమా మొదలైంది" అని అన్నారు.

"ఇక ఇంద్రలో తణికెళ్ల భరణి పోషించిన వాల్మీకి పాత్రను చిరు మొదట నన్నే చేయమన్నారు. ఆ సమయంలో కాలు నొప్పి ఉండటంతో ప్రయాణాలు చేయలేక ఆ రోల్‌ని వదులుకొన్నా. అలాగే నేను డైలాగ్‌లు చెబితే చూద్దామని ప్రేక్షకులు అనుకుంటారు, మూగవాడిగా ఉండిపోతే ఆ పాత్ర రక్తికట్టదని భావించి, అదే విషయాన్ని గోపాల్‌కూ చెప్పా. కాశీలో చిరంజీవిని చూడగానే ప్రకాశ్‌రాజ్‌ నమస్కారం చేస్తారు. ఆ సీన్‌ బాగా పండింది. కాకపోతే, దాన్ని తెరకెక్కించే సమయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే సీన్‌ తాను 'సమరసింహారెడ్డి'లో చేశానని, మళ్లీ అదే చేస్తే ప్రేక్షకులు ఓకే చేయరని గోపాల్‌ అన్నారు. కానీ, నేను దానికి ఒప్పుకోలేదు. కొన్ని సీన్స్‌, కాన్సెప్ట్స్‌ ఏ హీరో చేసినా చూస్తారు అని గట్టిగా నమ్మి.. ఆ సీన్‌ చేసేలా చేశా" అని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు." అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఇంద్ర' @20 ఇయర్స్​.. ఆ డైలాగ్​లను అలా రాశారు!

Last Updated : Jul 28, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details