తెలంగాణ

telangana

'నా జీవితానికి ఆయన ప్రశంసలు చాలు'.. కంగన ఎమోషనల్.. ఎవరి గురించో తెలుసా?

By

Published : May 19, 2023, 7:44 AM IST

Kangana Ranaut movies : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్​.. తనకు ఓ వ్యక్తి నుంచి వచ్చిన ప్రశంసలపై సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితానికి ఆ ప్రశంసలు చాలంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ కంగనాను ప్రశంసించింది ఎవరో తెలుసా?

Kangana Ranaut movies
Kangana Ranaut movies

Kangana Ranaut movies : ప్రముఖ సినీ కథా రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తన నటనపై ప్రశంసలు కురిపించారంటూ నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రశంసలు తన జీవితానికి చాలని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ చిత్రం ఎడిటింగ్ పూర్తయిందని, ఆ సినిమాను చూసిన తొలి వ్యక్తి విజయంద్ర ప్రసాదేనని కంగన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టారు.

"సినిమా చూస్తూ ఆయన పలుమార్లు కంట తడి పెట్టుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అని అన్నారు. నా గురువు, శ్రేయోభిలాషుల దీవెనలతో ఎమర్జెన్సీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీకి చేరుకుంది. సినిమా విడుదల ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం."
- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి

Emergency movie release date : గతంలో విజయేంద్ర ప్రసాద్​తో కలిసి పని చేశారు కంగనా రనౌత్. ఆయన కథ అందించిన 'మణికర్ణిక' చిత్రంలో కంగనా ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమా తీస్తున్నారు. సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంతో పాటు సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలో కీలక అధ్యాయమైన ఎమర్జెన్సీ రోజుల నాటి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కంగన.. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్నారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ పాత్రను శ్రేయస్ తల్పడే పోషించారు.

ఇక కంగన ఇతర చిత్రాల విషయానికి వస్తే.. ఆమె నటించిన చంద్రముఖి-2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్​గా ఈ చిత్రం రూపొందింది. చంద్రముఖి-లో రాఘవ లారెన్స్ కథా నాయకుడిగా నటించారు. పీ వాసు దర్శకత్వం వహించారు. కంగన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చిన నేపథ్యంలో రాబోయే సినిమాల కోసం ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

2019లో విడుదలైన మణికర్ణిక తర్వాత.. కంగనకు సరైన హిట్స్ లేవు. ఆ ఏడాది వచ్చిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది. 2020లో విడుదలైన పంగా సైతం డిజాస్టర్​గా నిలిచింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోగ్రఫీగా తెరకెక్కి.. 2021లో రిలీజైన తలైవి సైతం అభిమానులను నిరాశకు గురిచేసింది. 2022లో యాక్షన్ ఎంటర్​టైనర్​గా వచ్చిన ధాకడ్ చిత్రం సైతం బొక్కబోర్లా పడింది.

ABOUT THE AUTHOR

...view details