తెలంగాణ

telangana

'బాబాయ్​పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా పట్టించుకోను'

By

Published : Jan 26, 2023, 2:07 PM IST

Updated : Jan 26, 2023, 2:47 PM IST

'వీరసింహారెడ్డి' విజయోత్సవ సభలో అక్కినేని ఫ్యామిలీపై తాను చేసిన కామెంట్స్​పై స్పష్టత ఇచ్చారు హీరో బాలకృష్ణ. బాబాయ్‌(అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని ఆయన అన్నారు.

hero balakrishna replied on akkineni nageswara rao comments issue
hero balakrishna replied on akkineni nageswara rao comments issue

'వీరసింహారెడ్డి' సక్సెస్​మీట్​లో అక్కినేని ఫ్యామిలీపై నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్​ చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పుడా వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు. బాబాయ్‌(అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆ వ్యాఖ్యలపై మాట్లాడారు.

"అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు. అభిమానంతోనే యాధృచ్చికంగా అన్నాను. ఎన్టీఆర్​, ఏఎన్నార్ అలాగే అనేవారు. నేను ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తుంటే బాలయ్య వెళ్తున్నాడనే అంటారు. అది అభిమానంతోనే ఫ్యాన్స్​ అలా అంటారు అంతే. ప్రతిమాటకు బాధపడాల్సిన అవసరం లేదు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాం. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను" అని బాలకృష్ణ అన్నారు.

అసలేం జరిగిందంటే.. వీర సింహారెడ్డి సక్సెస్​మీట్​లో అక్కినేని, ఎస్వీ రంగరావును ఉద్దేశిస్తూ.. నందమూరి బాలకృష్ణ కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యా. బాలయ్య కించపరిచేలా మాట్లాడారంటూ, అలా అనడం సరికాదంటూ అక్కినేని ఫ్యాన్స్​ నిరసన వ్యక్తం చేశారు. సోషల్​మీడియా వేదికగా బాలయ్యపై మండిపడ్డారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని వారసులు, యంగ్ హీరోస్​ నాగచైతన్య, అఖిల్ కూడా​ స్పందించారు. అలా అనడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియా ద్వారా ఓ నోట్​ను పోస్ట్ చేశారు. 'ఎన్టీఆర్ , అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనం కించపర్చుకోవడం అవుతుంది' అని అన్నారు.

బాలయ్యకు మద్దతుగా.. అనంతరం ఎస్పీ రంగరావు మనవళ్లు జూనియర్‌ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) కూడా స్పందించారు. ఓ వీడియో బైట్‌ రిలీజ్‌ చేశారు. అయితే వారు బాలయ్యకు మద్దతుగా మాట్లాడారు. తమ తాత, ఎస్వీ గురించి బాలయ్య మాట్లాడిన దాంట్లో వివాదం కనిపించడం లేదనితెలిపారు. తమకు, బాలకృష్ణకు మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు.

"నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా మేం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. మేం ఒక కుటుంబంగా ఉంటాం. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారు. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగిదీయవద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు" అని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Jan 26, 2023, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details