Hero Directors Combo : సినీ ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ ఓ స్టార్తో సినిమా తీసి.. అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే ఇక ఆ తర్వాత అటు ఆ హీరోతో పాటు డైరెక్టర్ కూడా మరో ప్రాజెక్ట్కు చేతులు కలిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రేక్షకులు కూడా ఇటువంటి క్రేజీ కాంబోలో మరో సినిమా పడితే బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వడం ఖాయం అంటూ అభిప్రాయపడుతుంటారు. అయితే అటువంటి కాంబో మరో సారి కలిసి పని చేయాలంటే దానికి తగ్గట్టు కథ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభిమానులు సైతం వారిపై భారీ అంచనాలను పెట్టుకుంటారు కాబట్టి ఈ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక వేళ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోకపోతే ఇక అంతే సంగతులు.. అభిమానులు కూడా ఇక మరో సారి వారిపై నమ్మకం పెట్టుకోరు. కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కు సరితూగేలా సినిమాలు చేస్తూ.. పలు కాంబోలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాయి. వాటిలో కొన్నేమో సీక్వెల్స్ అయితే మరికొన్నేమో కొత్త ప్రాజెక్ట్స్. అలా టాలీవుడ్లో ఒక్క సారి రెండు సార్లు కాదు ఏకంగా నాలుగోసారి కలిసి వర్క్ చేసేందుకు రెడీగా ఉన్న స్టార్స్ ఎవరంటే..
త్రివిక్రమ్- అల్లు అర్జున్
Trivikram Allu Arjun Movies : ఇటీవలే తమ నాల్గవ ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబో. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠ పురంలో' సినిమాలు ఆడియెన్స్ను అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ వీరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.
సుకుమార్- అల్లు అర్జున్
Sukumar Allu Arjun Movies : అల్లు అర్జున్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమాల్లో 'ఆర్య -1' ఒకటి. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ రూపొందించారు. అప్పట్లో యూత్ను ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకు వచ్చిన 'ఆర్య -2' కూడా మంచి టాక్ అందుకుంది. ఇలా ఈ కాంబోలో రెండు క్లాస్ సినిమాలు వచ్చాక.. సుక్కు ఓ మాస్టర్ ప్లాన్తో 'పుష్ప' సినిమాను తెరకెక్కించారు. అల్లు అర్జున్ లీడ్ రోల్లో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ను షేక్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో అల్లు అర్జున్కి కూడా మాస్ హీరోగా మంచి పేరు వచ్చింది. ఇక ఈ కాంబో 'పుష్ప 2' సినిమా కోసం మరోసారి కలిసింది.
గోపిచంద్ మలినేని- రవితేజ
Gopichand Malineni Ravi Teja Movies : టాలీవుడ్లో ట్రెండ్ సృష్టించిన మరో క్రేజీ కాంబో మాస్ మహారాజా రవితేజ - దర్శకుడు గోపిచంద్ మలినేని. వీళ్లిద్దరూ ఇప్పటికే మూడు చిత్రాలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబోలో వచ్చిన 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినవే.
బోయాపాటి శీను- బాలకృష్ణ
Bala krishna Boyapati Movies : అటు మాస్ నుంచి ఇటు క్లాస్ ఆడియెన్స్లో బాలకృష్ణ - బోయపాటి కాంబోకు మంచి క్రేజ్ ఉంది. ఈ కలయికలో వచ్చిన సినిమాలు థియేటర్లలో సంచలనాలు సృష్టించాయి. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.