జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన 'సైమా' అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి విమర్శకుల ఉత్తమ నటుడిగా నవీన్ అవార్డు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్, రణ్వీర్ సింగ్తోపాటు దక్షిణాదికి చెందిన స్టార్హీరోహీరోయిన్ల సమక్షంలో అవార్డు అందుకోవడం పట్ల నవీన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు తాజాగా ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన వీడియోలో నవీన్ పొలిశెట్టిపై ఐకాన్స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసలు కురిపించారు. "అడ్డంకులు రావడం సమస్యే కాదు. మన కలలను సాధించడం కోసం ముందుకు పరుగెత్తాలి. దానికి నవీన్పొలిశెట్టే క్లాసిక్ ఎక్సాంపుల్" అని అన్నారు.
నవీన్ పొలిశెట్టిపై అల్లుఅర్జున్ ప్రశంసలు.. ఆ విషయంలో అతడే సరైనోడంటూ! - నవీన్ పొలిశెట్టిపై అల్లుఅర్జున్ ప్రశంసలు
జాతిరత్నాలు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యవ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మాట్లాడారు ఐకాన్స్టార్ అల్లుఅర్జున్. ఏం అన్నారంటే..

నవీన్ మాట్లాడుతూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి రోజులు, నిద్రలేని రాత్రులు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటే.. తప్పకుండా కలలు నిజం అవుతాయని చెప్పారు. తన కెరీర్ బెంగళూరులో థియేటర్ ఆర్టిస్ట్గా మొదలైనట్లు చెప్పారు. అప్పుడు తాను రూ.750 చెక్ అందుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు నుంచే నటుడు కావాలని కలలు కన్నట్లు చెప్పారు. అల్లుఅర్జున్ ఆర్య సినిమా చూసి తప్పనిసరిగా నటుడుగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ చిత్రమే తన స్ఫూర్తి అని పేర్కొన్నారు. కాగా, దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది.
ఇదీ చూడండి: ''గాడ్ఫాదర్'లో నాన్నను అలా చూసి చాలా హ్యపీగా ఫీలయ్యా!'