బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రహదారి భద్రత గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందించిన ఓ ప్రకటనలో ఆయన నటించడమే కారణం. అదేంటి ప్రజల్ని చైతన్యపరిచే యాడ్లో నటిస్తే వివాదంలో చిక్కుకోవడమేంటి అనుకుంటున్నారా? అసలేం జరిగిందంటే..
రహదారి భద్రత గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందిన యాడ్లో అక్షయ్ కుమార్ నటించారు. అయితే ఈ ప్రచార వీడియో వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో రెండు ఎయిర్ బ్యాగులున్న కారుకన్నా ఆరు ఎయిర్ బ్యాగులున్న వాహనం సురక్షితమనే సందేశమిచ్చేందుకు ఈ ప్రకటనను రూపొందించారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి పంపిస్తున్న సమయంలో రెండు ఎయిర్ బ్యాగులున్న కారులో ఎక్కిన కుమార్తె, అల్లుడు విచారంగా కనిపిస్తారు. పోలీస్ అధికారి అయిన అక్షయ్ కుమార్ ... సురక్షిత ప్రయాణం కోసం ఆరు ఎయిర్ బ్యాగులన్న కారు సమకూర్చాలని సూచించగా వధువు తండ్రి అంగీకరిస్తారు. ఆ వాహనం ఎక్కిన నవదంపతులిద్దరి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. రహదారుల లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే ఖరీదైన కారుల్లో వెళ్లాలని సూచించే ప్రకటనలను రూపొందించడం ఏమిటని శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది, టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తదితరులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి:''జనగణమన' గురించి మర్చిపోండి'.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్!