'మట్టికుస్తీ'లో తాను చేసిన పాత్ర ఎంతో సవాల్తో కూడుకున్నదని, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని నటి ఐశ్వర్య లక్ష్మి అన్నారు. విష్ణు విశాల్ కథానాయకుడిగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. రవితేజ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మి పంచుకున్న విశేషాలు..
ఈ పాత్రకు న్యాయం చేయలేననిపించింది!
"మూడేళ్ల క్రితం కొవిడ్కు ముందే 'మట్టి కుస్తీ' కథ విన్నా. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ల తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్లో కొన్ని సినిమాలు చేయడంతో నమ్మకం కలిగింది. ఈ పాత్ర ఫిజికల్ వర్క్ను డిమాండ్ చేస్తుంది. దానికి తగిన విధంగా సిద్ధం కావాలి. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ప్రేక్షకులు ఈ పాత్రను ఎలా తీసుకుంటారో తెలీదు"