యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా 'కార్తికేయ 2'. సాధారణ సినిమాగా విడుదలై ఘన విజయం అందుకుంది. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సీఫీసు వద్ద దాదాపు రూ.120 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలోనే దాదాపు రూ.30 కోట్లకు పాగా కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు. దీంతో నిఖిల్ ఎక్కడికి వెళ్లినా 'కార్తికేయ 3' ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారట.
ఇక సీక్వెల్ చేసేవరకు తనను వదిలేలా లేరని ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అన్నారు సిద్ధార్థ్. కార్తికేయ రిలీజ్ అయినప్పుడు కూడా తనను ఇలాంటి ప్రశ్నలే అడిగారని చెప్పారు. "ఒక వేళ నేను 'కార్తికేయ 3' చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు. కానీ మా అమ్మా మాత్రం నన్ను వదలదు" చెప్పుకొచ్చారు. అయితే ఈ సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. అయితే ఈసారి సినిమా శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో ఉంటుందని పలు ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే నిఖిల్.. దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన 18 పేజెస్ సినిమాలో నటించారు. దీన్ని గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమాలోని కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో నిఖిల్కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.