తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుడి కిడ్నాప్​.. రూ.3 లక్షలు డిమాండ్​.. సినిమా స్టైల్​లో కారును ఛేజ్​ చేసి..! - Kidnap in Dharmapuri jagtial district

Young Man Kidnap in Dharmapuri: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్​ కలకలం రేగింది. నరేశ్​ అనే యువకుడిని కిడ్నాప్​ చేసిన దుండగులు.. రూ.3 లక్షలు డిమాండ్​ చేశారు. అనంతరం యువకుడిని మరో ప్రాంతానికి తరలిస్తుండగా బాధితుడి బంధువులు దుండగుల కారును ఛేజ్​ చేసి పట్టుకున్నారు.

యువకుడి కిడ్నాప్​.. రూ.3 లక్షలు డిమాండ్​..
యువకుడి కిడ్నాప్​.. రూ.3 లక్షలు డిమాండ్​..

By

Published : Oct 19, 2022, 9:47 AM IST

Updated : Oct 19, 2022, 10:55 AM IST

యువకుడి కిడ్నాప్​.. రూ.3 లక్షలు డిమాండ్​.. సినిమా స్టైల్​లో కారును ఛేజ్​ చేసి..!

Young Man Kidnap in Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ యువకుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ధర్మపురికి చెందిన సంగి నరేశ్​ అనే యువకుడు మంగళవారం రోజు పూజ కోసం పట్టణంలోని ఓ అర్చకుడి వద్దకు వెళ్లాడు. అంతలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు అక్కడికి వచ్చి.. మాట్లాడేది ఉందని చెప్పి నరేశ్​ను పక్కకు పిలిచారు.​ అనంతరం అతడి కాళ్లు, చేతులు కట్టేసి కిడ్నాప్ చేశారు.

అర్చకుడి ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నరేశ్​ కోసం సాయంత్రం వరకు వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల ఉనికిని పసిగట్టిన కిడ్నాపర్లు.. నరేశ్​ను కిడ్నాప్ చేసి ఉంచిన చోటు నుంచి మరోచోటుకు కారులో తరలిస్తుండగా యువకుడి బంధువులు గమనించి కిడ్నాపర్ల కారును వెంబడించారు. ధర్మపురి మండలంలోని కోసునూరిపల్లె వద్ద పట్టుకొని ఠాణాలో అప్పగించారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'కిడ్నాపర్లు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం రూ.2 లక్షలైనా ఇస్తేనే నన్ను వదిలేస్తామన్నారు. లేదంటే చంపేస్తామంటూ బెదిరించారు. డబ్బుల కోసం వేధిస్తూ.. ఉదయం నుంచి రాత్రి వరకు గంటకోసారి నాపై దాడి చేశారు. అనంతరం నన్ను మరో ప్రాంతానికి తరలిస్తుండగా మా బంధువులు కిడ్నాపర్ల కారును వెంబడించి.. నన్ను కాపాడారు' అని నరేశ్ తెలిపాడు.

Last Updated : Oct 19, 2022, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details