MURDER UPDATE కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చి, సహజ మరణంగా చిత్రీకరించింది. కుటుంబసభ్యులు, బంధువులు అదే నిజమని నమ్మారు. తాము బయటపడ్డామని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్ఫోన్లోని సమాచారంతో మృతుడి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో గుట్టు బయటపడింది. ఏపీలోని కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అక్బర్ ఆజాం ఈ ఏడాది జూన్ 23న మరణించారు. హత్య అనే అంచనాలతో 59 రోజుల తర్వాత శవపరీక్ష చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరానికి చెందిన పీపీ అక్బర్ ఆజాం (50) మొదటి భార్య 15 ఏళ్ల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. తర్వాత యానాంకు చెందిన అహ్మదున్నీషా బేగం (36)ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు జన్మించారు. ఆజాం తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్నారు. గతంలో ఆయన తన భార్యకు కొత్త ఫోన్ కొని ఇచ్చి.. అప్పటిదాకా ఆమె వాడిన పాత ఫోన్ను తన తండ్రి హుస్సేన్కు ఇచ్చారు. కుమారుడి మరణానంతరం ఇటీవల హుస్సేన్ ఆ ఫోన్లోని పాత వాట్సప్ ఛాటింగ్స్, వాయిస్ మెసేజ్లను గమనించారు. అందులో ఆజాం నివాసముండే అపార్ట్మెంట్లో పై ఫ్లాట్లో ఉంటున్న రాజస్థాన్కు చెందిన రాజేష్ జైన్తో పాటు మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్తో కోడలు అహ్మదున్నీసా జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. వాటి ఆధారంగా తన కొడుకుది హత్యేమోనని అనుమానించిన హుస్సేన్ ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.