తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2022, 10:55 AM IST

Updated : Jun 4, 2022, 3:11 PM IST

ETV Bharat / crime

జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు నిందితులు అరెస్టు..!

Jubilee hills gang rape case: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాాచారం. అయితే పోలీసులు మాత్రం ముగ్గురినే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.

Jubilee hills gang rape case
జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Jubilee hills gang rape case: రాజధాని నగరంలో దారుణం చోటుచేసుకుంది.. పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఓ మైనర్​ను హైదరాబాద్​లో అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు సమాచారం. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్​ఖాన్​ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్​లను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత లేదు. పోలీసులు మాత్రం తాము ఇప్పటివరకు ముగ్గురునే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.

ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా.. భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి.. తండ్రి ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక షాక్‌ నుంచి తేరుకున్నాక.. భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో అనునయంగా మాట్లాడడంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ కాంగ్రెస్‌, భాజపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణా వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు పుర్ఖాన్‌ కూడా నిందితుల్లో ఉన్నారంటూ ప్రచారమవగా, తనకు సంబంధం లేదంటూ పుర్ఖాన్‌ ఖండించారు.

ఇదీ జరిగింది..:జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ఒక బృందం మద్యం రహిత (నాన్‌ లిక్కర్‌ ఈవెంట్‌) వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లే. వారిలో ఒక బాలిక పబ్‌లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు (16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. వారు బాలికను బెంజి కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు. అక్కడ అరగంటపాటు సరదాగా గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో అయిదుగురు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన అయిదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలినిఅమ్నీషియా పబ్‌ వద్ద దింపేసి వెళ్లారు.

గాయాలు చూసి ఫిర్యాదు:బాలిక కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె తన తండ్రికి ఫోన్‌ చేసింది. ఆయన పబ్‌ వద్దకు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు. మెడపై గాయాలను గుర్తించి ప్రశ్నించినా, ఆమె సమాధానం చెప్పలేదు. అనుమానంతో తండ్రి మే 31న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేశారు. తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ బాధితురాలిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంబంధిత సెక్షన్లు జోడించారు.

టీఆర్‌ (టెంపరరీ రిజిస్ట్రేషన్‌) నంబరుతో ఉన్న ఇన్నోవా కారులో ఈ అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌కు సంబంధించినదని నిర్ధారించుకున్నారు. అందులో ఉన్న వారిని సీసీ టీవీ ఫుటేజీల సాయంతో గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. బెంజి కారు యజమాని కుమారుడి వివరాలూ సేకరిస్తున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి ఆధారాలు లభించకుండా నిందితులు ప్రయత్నాలు చేశారు. ఇన్నోవా వాహనాన్ని మాయం చేశారు. తమ ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించారు.

నిందితులను వదిలిపెట్టొద్దు: హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠినచర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఎవరినీ వదిలిపెట్టొద్దని.. ఎంతటి హోదా కలిగిన వారున్నా ఉపేక్షించవద్దని సూచించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై హోంమంత్రి మహమూద్‌ అలీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘అది ఘోరమైన ఘటన. నిందితులెవరైనా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

భాజపా, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో ఆందోళన

బాలికపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ భాజపా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణా వద్ద శుక్రవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనగా వచ్చిన భాజపా నేతలు ఠాణా వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, లంకల దీపక్‌, సందీప్‌ యాదవ్‌, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేష్‌ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఠాణాలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్‌ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సునీతారావు, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ వద్దకు వచ్చారు. అత్యాచారం కేసులో పోలీసులు వివరాలు చెప్పడం లేదని, గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తూ మంత్రుల నివాస సముదాయం వద్దకు వెళ్లారు. హోంమంత్రి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

సీబీఐ విచారణ జరిపించాల్సిందే:సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో మజ్లిస్‌, తెరాస నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని.. వారందరినీ ఈ కేసు నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సంజయ్‌ విలేకరులతో మాట్లాడుతూ- ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ‘బాలికపై అత్యాచారం చేసిన వారి పేర్లను మే 28న చేసిన ఫిర్యాదులోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదు? మేజిస్ట్రేట్‌ ఎదుట బాలిక వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదు? పబ్‌లో పార్టీ ఏర్పాటు చేసింది, మైనర్లను అనుమతించింది ఎవరు? ఇన్ని రోజులూ పోలీసులకు సీసీ టీవీ దృశ్యాలు దొరకలేదా’ అంటూ సంజయ్‌ ప్రశ్నలవర్షం కురిపించారు. నిందితుల్ని అరెస్టు చేయాలని కోరడానికి వెళ్లిన భాజపా కార్యకర్తల్ని అరెస్టు చేశారని, మహిళలని చూడకుండా పిడిగుద్దులు కురిపించారని మండిపడ్డారు. బాధిత బాలిక కుటుంబాన్ని బెదిరించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. తెరాస ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని సీఎంను డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ స్పందించాలి:మైనర్‌ బాలికపై యువకులు గ్యాంప్‌రేప్‌కు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఘటనపై ఆయన ట్విటర్‌ వేదికగా శుక్రవారం స్పందించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఏ వర్గం ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. అత్యాచారం జరిగి 5 రోజులు కావస్తున్నా అరెస్టులు లేకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావులు వేర్వేరు ప్రకటనల్లో ఈ ఘటనను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌... పోలీసుల అదుపులో నిందితులు!

కన్నబిడ్డపై రేప్.. తల్లిదండ్రులకు మరణ శిక్ష.. లిఫ్ట్​లో బాలికకు వేధింపులు

పీరియడ్స్​ను మహిళా అథ్లెట్స్​ ఎలా మేనేజ్‌ చేస్తారో తెలుసా?

Last Updated : Jun 4, 2022, 3:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details