తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2021, 10:22 AM IST

ETV Bharat / crime

TIGERS: పెద్దపులులు అంతరించిపోతున్నాయి.. తొమ్మిదినెలల్లో 99 మృతి

అడవిలో నిర్భయంగా తిరిగే పెద్దపులులు (TIGERS) ఇప్పుడు స్వేచ్ఛగా తిరగాలంటే భయపడుతున్నాయి. ఎక్కడ కరెంటు తీగలున్నాయో, ఎటువైపు నుంచి వేటగాళ్లు విరుచుకుపడతారేమోనని వణికిపోతున్నాయి. 2021లో తొమ్మిదినెలల్లో దేశవ్యాప్తంగా 99 పెద్దపులులు చనిపోయాయి. రాష్ట్రంలో ములుగుజిల్లా కొడిశాలలో తాజాగా హతమైన పులి (TIGERS)తో ఆ సంఖ్య వందకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అంతరించేదశలో ఉన్న పెద్దపులులు ఏడాదిలోపే ఇన్ని మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

TIGERS
పెద్దపులులు అంతరించిపోతున్నాయ్

దేశంలో 2,967 పులులు ఉంటే తెలంగాణలో వాటి సంఖ్య 26. అంటే 0.87శాతం మాత్రమే. ఉన్నకొద్ది పులులూ (TIGERS) అధికారుల నిర్లక్ష్యం, వేటగాళ్ల ధనదాహంతో బతికిబట్ట కట్టడానికి కష్టపడాల్సి వస్తోంది. ములుగుజిల్లా ఏటూరునాగారం ముల్లకట్ట బ్రిడ్జి వంతెన వద్ద జులై 29న పులి చర్మం (TIGER SKIN) దొరికింది. ఈ ఘటన తర్వాతైనా మేలుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా రెండునెలల్లో ఇదే జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నా

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో పులుల (TIGERS)సంఖ్య పెరుగుతోంది. కొన్ని ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదిని దాటిని రాష్ట్రంలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, ఆసిఫాబాద్‌ అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుతో పాటు ములుగు, భూపాలపల్లి, భద్రాది-కొత్తగూడెం అటవీప్రాంతాల వైపు వస్తున్నాయి. వీటికి ఆపద రాకుండా చర్యలు తీసుకోవాల్సిన కీలక సమయాల్లో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ఫలితంగా వేటగాళ్లు కరెంటుతీగలు, ఉచ్చులు పెట్టి పులుల ప్రాణాలు తీస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక పులి శరీరభాగాలు రూ.కోటి వరకు పలుకుతున్నాయి.

ప్రత్యేక అధికారులు ఏరీ?

అటవీశాఖలో వన్యప్రాణుల సంరక్షణకు చీఫ్‌వైల్డ్‌లైఫ్‌ వార్డన్‌ పోస్టున్నా ఎవరికీ బాధ్యత అప్పగించలేదు. అటవీసంరక్షణ ప్రధానఅధికారికే అదనపు బాధ్యతలు. అదనపు చీఫ్‌వైల్డ్‌లైఫ్‌ వార్డన్‌ పోస్టుకూ ఇంఛార్జే ఉన్నారు. దీంతో పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిస్థాయి అధికారులే లేనిపరిస్థితి. ఏటూరునాగారం అభయారణ్యానికి ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్‌ విభాగం, ఓ డీఎఫ్‌ఓ ఉండేవారు. నాలుగేళ్ల క్రితం ఆ విభాగాన్ని తీసేశారు.

కనిపిస్తేనే ఉన్నట్లు!

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో గతేడాది నుంచి మూడు, నాలుగు వరకు పులుల జాడలు కనిపించాయి. ఇందులో రెండు హతమయ్యాయి. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో రెండు విడతల్లో నాలుగేసి చొప్పున ఎనిమిది పులులకు జన్మనిచ్చిన ఆడపులి ఫాల్గుణ ఉందా? లేదా? ఎవరికి తెలియదు. ‘కె’సిరీస్‌లో 1-9 వరకు ఉండగా కే6 సహా కొన్ని కనిపించట్లేదని నిపుణులు అనుమానిస్తున్నారు.

ప్రణాళికలు ఉండాలి

పొరుగురాష్ట్రాల నుంచి వచ్చే పులుల్ని కాపాడుకుంటే ఇక్క సంఖ్య బాగా పెరుగుతుంది. పులుల్ని రక్షించడానికి తగిన ప్రణాళికలు ఉండాలి.

- ఇమ్రాన్‌ సిద్దిఖీ, హైదరాబాద్‌ పులుల సంరక్షణ సంఘం డైరెక్టర్‌

లెక్క చెప్పకూడదు

నిబంధనల మేరకు పులుల మొత్తం సంఖ్య లెక్క చెప్పొద్దు. ఏడాది క్రితం కనిపించిన పులులు ఇప్పుడున్నాయి. ఫాల్గుణ పులి చాలాకాలం క్రితమే మహారాష్ట్ర వెళ్లింది. పులులు స్థిరంగా ఒకచోట ఉండవు.

- శాంతారాం, డీఎఫ్‌ఓ, ఆసిఫాబాద్‌

ఇదీ చూడండి:వరుస దాడులు చేస్తున్న ఆ పులి కోసం వేట షురూ..

black tiger: వీడిన నల్లపులి రంగు రహస్యం

Tiger Offspring: అభయారణ్యాల్లో పులి కూనలు... ఏడాదిలోనే ఎనిమిది జననం

రాయల్​ బంగాల్​ టైగర్​ను చంపిన అటవీ సిబ్బంది.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details